చిలీలో ట్రెక్కింగ్కు వెళ్లి గిన్నిస్ రికార్డ్ విజేత మల్లి మిస్సింగ్, ఏపీ వ్యక్తి
హైదరాబాద్: ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను 172 రోజుల్లో అధిరోహించి గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగెం మండలం గాంధీజనసంఘం గ్రామవాసి మల్లి మస్తాన్ బాబు అదృశ్యమయ్యాడు. ఇది గ్రామంలో విషాదఛాయలు నింపింది.
మస్తాన్ బాబు చిలీ, అర్జెంటీనా దేశాల మధ్య ఉన్న ఎత్తైన కొండలను ఎక్కేందుకు వెళ్లాడు. అయితే, గత రెండు రోజులుగా ఆయన ఆచూకీ లభించడం లేదు. అతను ఇటీవల కొంతమందితో కలిసి చిలీ దేశంలో పర్వతారోహణం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రతికూల వాతావరణం ఉండడంతో మస్తాన్ సహచరులందరూ వెనుతిరిగారు.
కానీ మస్తాన్ మాత్రం పర్వతారోహణానికి వెళ్లారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. చిలీ దేశంలోని పర్వతం అధిరోహించడానికి వెళ్లిన ఆయన అదృశ్యమైనట్టు ఆయన సహచరులు చిలీలోని భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న మస్తాన్ ఖరగ్పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసిన ఆయన పర్వతారోహణం మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. చిలీలో మస్తాన్ అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల్లి మస్తాన్ బాబు 2006 జనవరి 19 నుంచి జూలై 10 వరకు ఏడు ఖండాల్లోని పర్వతాలను అధిరోహించారు.