మల్లి మృతి: భౌతికకాయం తెప్పిస్తామని వెంకయ్య
న్యూఢిల్లీ: ఆండీస్ పర్వతాలలో మృతి చెందిన మల్లి మస్తాన్ బాబు భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. అర్జెంటీనా - చీలీ పర్వతాల్లో పర్వాతారోహణకు వెళ్లిన మల్లి మస్తాన్ బాబు మృతి చెందారు.
ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం నాడు మస్తాన్ బాబు కుటుంబ సభ్యులు కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారికి వెంకయ్య హామీ ఇచ్చారు. వెంకయ్య అర్జెంటీనా, చిలీ అధికారులతో మాట్లాడారు. వాతావరణం అనుకూలించక పోవడంతో మస్తాన్ బాబు మృతదేహం సంఘటన ప్రాంతంలోనే ఉంది.
ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వతాలను అధిరోహించి భారత పతాకాన్ని రెపరెపలాడించిన మస్తాన్ మరో రికార్డు నెలకొల్పేందుకు వెళ్లి ప్రాణాలనే కోల్పోయారు. ప్రతికూల వాతావరణం కారణంగా చిలీ, అర్జెంటీనాల మధ్యనున్న ఆండీస్ పర్వతాల్లో పది రోజుల క్రితం గల్లంతైన మస్తాన్ మరణించారు.
మస్తాన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన హెలికాప్టర్లు అర్జెంటీనాలోని సెర్రో ట్రెస్ క్రూసెస్ సుర్ మంచు పర్వత ప్రదేశంలో 5,900 అడుగుల ఎత్తున మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. మస్తాన్ గ్రామం గాంధీ జన సంఘం విషాదంలో మునిగిపోయింది.
మస్తాన్ గత నెల ఆండీస్ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్ (6749 మీటర్లు)ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్ క్యాంప్ నుంచి బయల్దేరాడు. చివరగా మార్చి 24న మస్తాన్ తన స్నేహితుడితో మాట్లాడాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్ క్యాంప్నకు వస్తానని చెప్పాడు. అంతలోనే ప్రాణాలు వదిలాడు.