స్పీకర్ సీరియస్, టీడీపీ ఎంపీల డ్రామాలకు తెరపడబోతుంది: జీవీఎల్ సంచలనం
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యులపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ డ్రామాలకు తెరపడబోతుందని ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. పార్లమంటు నియమావళికి వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బాబూ! జాగ్రత్త, గవర్నరేం చేస్తున్నారు: సోము వీర్రాజు, 'వెంకయ్య వద్దకు వైసీపీ వాళ్లను రమ్మంటే'
రోజుకో నాటకం వేస్తూ పార్లమెంటును వారు అభాసుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు చీప్ పబ్లిసిటీ ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని తాను స్పీకర్ను కోరానని చెప్పారు.
టోటల్ డ్రామా పార్టీ నాటకాలకు తెరపడబోతుంది
సంయుక్త సంఘం సభ్యుడిగా స్పీకర్కు తాను తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై ఫిర్యాదు చేశానని జీవీఎల్ నర్సింహా రావు చెప్పారు. సోమవారం లోగా టీడీపీ ఎంపీలు వ్యవహారశైలి మార్చుకోకుంటే సంయుక్త సంఘానికి చైర్మన్గా ఉన్న స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. తన ఫిర్యాదుపై స్పీకర్ సీరియస్గా (సీరియస్గా దృష్టి పెట్టడం) ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీని ఆయన టోటల్ డ్రామా పార్టీ (టీడీపీ) అంటూ పేర్కొన్నారు. వారి తీరు త్వరలో బయటపడుతుందన్నారు.
వరుసగా టీడీపీ ఎంపీల నిరసన
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతి రోజు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేస్తోన్న విషయం తెలిసిందే. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణలో నిరసన తెలుపుతున్నారు. విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నప్పటికీ నాలుగేళ్లలోనే కేంద్రం ఎన్నో చేసిందని, అయినప్పటికీ టీడీపీ ఎంపీలు ఇలా చేయడం సరికాదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటీవల విభజన హామీలపై కేంద్రం సుప్రీం కోర్టులో కూడా వరుసగా అఫిడవిట్లు దాఖలు చేసింది. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి, ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై జీవీఎల్ నిప్పులు చెరుగుతున్నారు. ఇందులో భాగంగా ఆయన వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు
జీవీఎల్ నాలుగు రోజుల క్రితం కూడా టీడీపీ ఎంపీలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో తన ప్రసంగం తర్వాత టీడీపీ నేతలు తనను బెదిరించారని నోటీసులు ఇచ్చారు. ఖబడ్దార్ అంటూ తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరికలు చేశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వీడియో, ప్రింట్ మీడియా క్లిప్పింగ్స్ను రాజ్యసభ కార్యదర్శికి సమర్పించారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతోనే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోమారు వారిపై ఫిర్యాదు చేసినట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
కాపు రిజర్వేషన్లపై చర్చపై వచ్చే వారం బీఏసీలో నిర్ణయించే ఛాన్స్
కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ లోకసభలో ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా తమిళనాడులో తరహాలో షెడ్యూల్ 9లో కాపులను చేర్చాలని ఇప్పటికే కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. విద్య, ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు కోరింది. ఈ నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. తాను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని అవంతి తెలుగులో చెప్పడం గమనార్హం. దీనిపై ఎప్పుడు చర్చ చేపట్టాలి? ఎంత సమయం కేటాయించాలి? అనే విషయంపై వచ్చేవారం జరిగే బీఏసీ నిర్ణయించే అవకాశముంది.