దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి:మంత్రి యనమల ధ్వజం
అమరావతి:దేశ వ్యాప్తంగా బీజేపీపై ఎదురుగాలి చాలా బలంగా వీస్తోందని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనికి తాజా ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. దేశంలో ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలో యనమల మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు.
Recommended Video
కర్ణాటక ఎన్నికలతో ప్రారంభమైన బీజేపీ పతనం...ఇప్పుడు ఈ రెండో అంకం ఉపఎన్నికల ఫలితాలతో సుస్పష్టమైందన్నారు. ఇక 2019 ఎన్నికలతో బీజేపీ ఓటముల పరంపర పూర్తవుతుందని యనమల అన్నారు. మోదీ శకం 5 ఏళ్లకే ముగిసిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నాలుగేళ్ల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ ఉపఎన్నికల ఫలితాలు చెంపపెట్టు అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల తేల్చిచెప్పారు. గతంలో కూడా రెండు ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారని...ఇప్పుడు మరోసారి దెబ్బతిన్నారని యనమల మండిపడ్డారు. ఇలా వరుస ఓటములు ఎదురవుతున్నా బీజేపీలో ఆత్మ విమర్శ కొరవడిందని అన్నారు.
తెలుగు పత్రికలతో...తేటతెల్లం
అబద్దాలను నిజాలుగా భ్రమింపజేయడానికి బీజేపీ పెద్దలు ఆపసోపాలు పడుతున్నారని, ఎంతచేసినా అసలు విషయం అనేది తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రకటనలతో తేటతెల్లమైందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపడం నిజం కాదా? అని యనమల ప్రశ్నించారు. ఏపీకి ఇచ్చిన నిధులు, పనులు అన్నీ కాగితాలకే పరిమితం చేశారన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకే కేంద్ర నిధులు ముట్టచెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ధొలేరా నగరాన్ని ప్రమోట్ చేసినట్లుగా అమరావతిని ఎందుకు ప్రమోట్ చేయలేదని యనమల కేంద్రాన్ని నిలదీశారు.
ఆ వ్యాఖ్యలు...రెచ్చగొట్టేలా
ఎపికి ప్రత్యేక హోదా కోసం ఎంతకాలమైనా వేచి ఉండాలన్న కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఏపీకి 5 ఏళ్లు కాదు.. 10ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్ చేసింది బీజేపీ కాదా? అని నిలదీశారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అని కేంద్రమంత్రిని ప్రశ్నించారు.
దిమ్మతిరిగి...ఆ యాడ్స్
కేంద్రం ఇచ్చిన నిధుల గురించి టిడిపి మహానాడులో తాము వివరించేసరికి బీజేపీ నాయకులకు వడదెబ్బ తగిలినట్లయి దిమ్మ తిరిగిపోయిందన్నారు. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకే హడావుడిగా తెలుగు రాష్ట్రాల్లో ధొలేరాపై యాడ్స్ గుప్పించారన్నారు. బీజేపీ ఇచ్చిన యాడ్స్తో తెలుగువారికి పుండు మీద కారం జల్లినట్లుగా ఉందన్న సంగతి గుర్తించుకోవాలన్నారు. బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పట్నుంచి ఏపీపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు.
ఆపరేషన్ గరుడ...నిజమేనేమో!
ఒక వైపు జగన్తో లాలూచీ రాజకీయాలు చేస్తూనే...మరోవైపు టిడిపి ప్రభుత్వంపై పవన్కళ్యాణ్తో విమర్శలు చేయిస్తున్నారని యనమల విమర్శించారు. ఇంకోవైపు కన్నాతో...సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పించడం...ఇంకోవైపు ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు రాయించడం, రమణదీక్షితులతో ఆరోపణలు చేయించడం ఇవన్నీ చూస్తుంటే...ఎవరో చెప్పినట్లుగా ‘ఆపరేషన్ గరుడ' ప్రచారం నిజమేనేమో అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. అయితే ఇదే ధోరణితో వ్యవహరిస్తే బీజేపీ పెద్దల వ్యూహం బెడిసికొట్టడం ఖాయమన్నారు. కన్నడియుల్లాగే ఏపీ ప్రజలు కూడా బిజెపికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని యనమల హెచ్చరించారు.