ఇద్దరిలో ఎవరికో?..: మూడో సీటు పైనా కన్నేస్తే!.. టీడీపీ రాజ్యసభ లెక్కలు
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఖాళీ అయిన మూడు స్థానాల్లో టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు కోసం ముగ్గురు వ్యక్తుల మధ్య పోటీ నడుస్తున్నట్టు చెబుతున్నారు.
సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, ఎంపీ సీఎం రమేష్, కావలి ఇన్చార్జీ బీద మస్తాన్ రావుల పేర్లను తుది దశ పరిశీలనకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం.
సీఎం రమేష్కు మరోసారి ఛాన్స్!
ప్రత్యేక హోదాపై రగడ జరుగుతున్నవేళ.. సీఎం రమేష్ లాంటి దూకుడైన నేత రాజ్యసభలో ఉంటే మంచిదని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఓ మారు రాజ్యసభ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన.. మరోసారి పదవి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇద్దరిలో ఎవరికో..
ఇక మరో స్థానం కోసం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, కావలి ఇన్ చార్జ్ బీద మస్తాన్ యాదవ్ ల మధ్య పోటీ సాగుతోంది. ఒకానొక దశలో సీఎం రమేష్ను పక్కనపెట్టి వీరిద్దరికే రాజ్యసభ ఖాయం చేస్తారన్న ప్రచారం కూడా సాగింది.
అయితే పరిస్థితుల రీత్యా ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. చంద్రబాబు ఓకె చేసేవరకు ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అనేది సస్పెన్స్ గానే ఉండనుంది.
మూడో సీటు పైనా కన్నేస్తే..
వైసీపీకి దక్కే ఒక్క స్థానాన్ని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆలోపు మరో నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగితే.. మూడో అభ్యర్థిని ఓటింగ్ ద్వారా ఖాయం చేసుకోవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అదృష్టం ఎవరిని వరిస్తుందో
ఒకవేళ టీడీపీ గనుక మూడో అభ్యర్థిని నిలిపితే ఓటింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు తొలి ప్రాధాన్యతా ఓట్లు విజయానికి సరిపడా తెచ్చుకోలేకుంటే, రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం అవుతాయి.
అయితే టీడీపీ ఆ సాహసం చేయకపోవచ్చన్న వాదన కూడా లేకపోలేదు. ఆవిధంగా సీఎం రమేష్, వర్ల రామయ్య, బీద మస్తాన్ యాదవ్ లలో టీడీపీ నుంచి రాజ్యసభ ఖాయమయ్యే అవకాశాలున్నాయి. చివరికి అదృష్టం ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.