ఆ కుర్రాడిని పట్టించుకునేవాళ్లు లేరా...దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ భవిష్యత్తు ఏమిటి?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవ్వరూ ఊహించలేరనేది...నూటికి నూరుపాళ్లు నిజం...ఓడలు బళ్లవడం...బళ్లు ఓడలు అవడం...ఈ సామెత కూడా రాజకీయాలకు వంద శాతం సూటవుతుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే...విజయవాడ రాజకీయాలను అనేక సంవత్సరాలపాటు అప్రహతితంగా శాసించిన దివంగత నేత దేవినేని నెహ్రూ మరణం నేపధ్యంలో ఆయన కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటనే విశ్లేషణ కోసం...
విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు దేవినేని ఫ్యామిలీ పేరు చెపితేనే దడ. ముఖ్యంగా దివంగత నాయకుడు దేవినేని నెహ్రూ విజయవాడ రాజకీయాలను అనేక సంవత్సరాలపాటు తన కనుసైగలతో శాసించారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చివరి రెండు ఎన్నికల్లో ఆయన ఓటమి తర్వాత తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు లేదని తేలడం, తన వారసుడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి కుమారుడు దేవినేని అవినాష్ తో సహా టిడిపి సైకిల్ ఎక్కేశారు.
కొడుకు భవిష్యత్తు కోసమే...టిడిపిలోకి...
తాను రెండుసార్లు ఓటమి పాలయ్యాక...రాష్టంలో...విజయవాడలో మార్పులు గమనించాక...తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించే దేవినేని నెహ్రూ టిడిపి లోకి చేరారని ఆయన సన్నిహితులు అంటుంటారు. పైగా టిడిపిలోకి వచ్చేటప్పుడు కూడా తమలో ఎవరో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీ తీసుకొనే పార్టీ మారినట్లు చెబుతుంటారు. నెహ్రూ పార్టీ మారినపుడు నియోజకవర్గాల పునర్విభజన ఖాయమనే అభిప్రాయం ఉండేది. అలా జరిగితే నియోజకవర్గం ఎంచుకునేందుకు తన ముందు పలు ఆప్షన్లు ఉంటాయని, వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని నెహ్రూ ఊహించారట. ఒకవేళ అలా జరగని పక్షంలో పెనమలూరు సీటు ఆయనకే అన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.
Recommended Video
ఊహించని పరిణామం...దేవినేని నెహ్రూ మరణం...
అయితే టిడిపిలోకి వచ్చి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సర్ధుకొని తనదైన శైలిలో పాగా వేయకముందే...కొడుకు భవిష్యత్తుకు సరైన పునాది వేసేలోపే...అనూహ్యంగా...అర్ధాంతరంగా...దురదృష్టవశాత్తు దేవినేని నెహ్రూ మృతిచెందారు.దేవినేని నెహ్రూ మృతి చెందడం ఆయన వర్గీయులకు, ముఖ్యంగా ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కు వ్యక్తిగతంగా...రాజకీయ భవిష్యత్తు పరంగా కోలుకోలేని దెబ్బలా పరిణమించింది. నెహ్రూ మరణం తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు అవినాష్ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. రాజకీయాల్లో పండిపోయిన నెహ్రూ ఉంటే ఆయనకు నాయకులు, సీనియర్లు ఇచ్చే గౌరవం వేరే. ఇప్పుడు ఆయనే లేకపోవడంతో...అవినాష్ బాగా జూనియర్ కావడంతో అతడి గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది.
చంద్రబాబును కలిసి...విన్నవించుకున్నా...
తన గురించి ప్రత్యేకంగా శ్రధ్ద తీసుకొని తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు పరిచే వారెవరూ లేకపోవడంతో స్వయంగా అవినాష్ రొంతకాలం క్రిందట టిడిపి అధినేత చంద్రబాబును కలిసి తనకు పార్టీ పరంగా ఏదైనా పదవి ఇవ్వాలని విన్నవించుకున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో విజయవాడ లోక్సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేయడమే ఇప్పటివరకు అవినాష్ ఉన్న ప్రత్యక్ష రాజకీయ అనుభవం. దేవినేని నెహ్రూ తాను పార్టీ మారినప్పుడు ఆ వేదిక మీదే తన కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబుదేనని ప్రకటించడం గమనార్హం.
అనుచరులు...చెల్లాచెదురు...
దేవినేని నెహ్రూ తన హయాంలో ఏ పబ్లిక్ మీటింగ్ కు వెళ్లినా మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా మొబైల్ నంబర్ 9848112369 కి కాల్ చెయ్యండి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పేవారు...ఆయన మరణం అనంతరం నెహ్రూ అభిమానుల సదస్సులో ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కూడా తన తండ్రి ఫోన్ మూగపోలేదని, పోదని అదే నంబర్ లో తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని ప్రకటించడానికి భారీ సంఖ్యలో హాజరైన నెహ్రూ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఆ తరువాత కాలంలో అవినాష్కు పార్టీలో ఏ పదవి లేకపోవడం, ఆయన గురించి శ్రద్ద చూపేవారెవరూ లేకపోవడం...వచ్చేఎన్నికల్లోనైనా ఆయనకు సీటు వస్తుందన్ననమ్మకం లేకపోవడంతో విజయవాడలోని దేవినేని నెహ్రూ వర్గం అటు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వైపు, ఇటు తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ దగ్గరకు, పాత కంకిపాడులోని మద్దతుదారులు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దగ్గరకు చేరిపోయారు. దీంతో ఒకప్పుడు విజయవాడ నగరంలో బలంగా ఉన్ననెహ్రూ వర్గం ఇప్పుడు కనీసం బలంగా ఉనికి చాటుకోలేని పరిస్థితుల్లో ఉంది.
అసలు సీటు దక్కుతుందా...ఎక్కడిస్తారు?
అవినాష్ ఇప్పుడే ఇన్ని కష్టాలు ఎదుర్కొంటుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు లభిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నం కావడం సర్వసహజం. ఈ ప్రశ్నకు సమాధానం దేవినేని అవినాష్ కు ప్రతికూలంగా ఉండొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన ఉండి ఉంటే విజయవాడలో నగరంలో కొత్తగా వచ్చే ఏదో ఒక సీటును అవినాష్కు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇక ఇప్పుడు పునర్విభజనకు అవకాశం లేని పక్షంలో అవినాష్కు 2019లో అయితే సీటు రావడం చాలా కష్టమని చెప్పకతప్పదు. ఎందుకంటే విజయవాడ సెంట్రల్లో బొండా ఉమా, తూర్పులో గద్దే రామ్మోహన్ పాతుకుపోయినట్లే...పాత కంకిపాడు స్థానంలో వచ్చిన పెనమలూరులో లోకేష్ పోటీ చేయడం ఖాయమని టాక్ నడుస్తోంది. గన్నవరానికి వల్లభనేని వంశీ ఆస్థాన విద్యాంసుడిలా మారారు. దీంతో అవినాష్కు అసెంబ్లీ సీటు ఎక్కడ సర్ధుబాటు చెయ్యగలరనేదే ప్రశ్న.
అసలు శ్రద్ద తీసుకునేది ఎవరు?
దేవినేని నెహ్రూ పార్టీలో చేరేటప్పుడు తనకు, లేదా కుమారుడికి ఒకరికి టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా?...నిజమైతే మారిన పరిస్థితుల్లో నెహ్రూ నే లేకపోయాక చంద్రబాబు తన హామీని అమలు చేస్తారా?...అన్నకుమారుడి భవిష్యత్తు గురించి దేవినేని ఉమా పట్టించుకొని అతనికి సీటు కోసం పట్టుబట్టగలరా...మరో బాబాయి బాచి ప్రసాద్ ఏమైనా తోడ్పాటును అందించగలరా?..అలా అతనికి ఏదో ఒక చోట సీటు ఇప్పించడానికి నడుంబిగించి కృషి చేసేది ఎవరు?..ఈ ప్రశ్నలకు నేడు సమాధానం దొరకడం కష్టంగా మారడమే దేవినేని అవినాష్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది తేటతెల్లం చేస్తోంది. అయితే విజయవాడ ప్రాంతాన్నిఒకప్పుడు శాసించిన దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు...దటీజ్ పాలిటిక్స్...