ఆదరించే అభిమానులున్నా... ఓట్లేసే జనం లేరు.. వంగవీటి వారసుడికి బెజవాడలో విచిత్ర పరిస్ధితి ?
ఏపీ రాజకీయాల్లో బెజవాడ రాజకీయాలది ఓ విలక్షణమైన పాత్ర. ఇక్కడ ఎవరు రాజకీయం ఎలా మొదలుపెడతారో, ఎప్పుడు ముగిస్తారో, అందుకు గల కారణాలేంటో కూడా ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. గతంలో ముఠా కక్షల నేపథ్యంలో సాగిన రాజకీయాలు, వంగవీటి రంగా హత్య తర్వాత పూర్తిస్ధాయి పార్టీ రంగు పులుముకున్నాయి. కానీ అప్పుడు ముఠాకక్షల్లో కీలకపాత్ర పోషించిన వారి వారసులు మాత్రం ఇప్పుడు పార్టీ రాజకీయాలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బెజవాడలో రంగా హవా...
80వ దశకం చివర్లో కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా సాగిన రాజకీయాలు ఆ తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయాయి. దీంతో అప్పట్లో కమ్యూనిస్టుల మద్దతుతో ముఠా రాజకీయాలు నడిపిన వెంకటరత్నం వంటి వారిని గట్టిగా ఎదుర్కొన్న కార్మిక నేత వంగవీటి రంగా బెజవాడ రాజకీయ చదరంగంలో హీరోగా మారిపోయారు. ఆయన బెజవాడకే కాదు ఏపీలోని పలు జిల్లాల్లో తన వర్గాన్ని నెలకొల్పడంలో సక్సెస్ అయ్యారు. ఓ దశలో టీడీపీకి కంట్లో నలుసుగా మారిపోయిన పరిస్ధితుల్లో జరిగిన రంగా హత్య బెజవాడలోనే కాదు మొత్తం ఏపీలోనే ఓ సంచలనం.
అప్పట్లో రంగా ప్రత్యర్ధులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనడమే కాక ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు.
రంగా వారసుడిగా తెరపైకి రాధా..
1992లో రంగా హత్య తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుమారుడు రాధాకృష్ణ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఓసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆ తర్వాత అదే హవా కొనసాగించడంలో విఫలమయ్యారు. 2009లో వైఎస్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ను కాదని ప్రజారాజ్యం టికెట్ తెచ్చుకుని ఓసారి ఓటమిపాలైన రాధా... సరిగ్గా పదేళ్ల తర్వాత తిరిగి అదే తప్పుచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్ధితులు ఉన్నాయని తెలిసి కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా వద్దని, టీడీపీ తలుపుతట్టి కనీసం పోటీ కూడా చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు.
టీడీపీలోకి ఎందుకెళ్లారో ...
విజయవాడ రాజకీయాల్లో మంచి ఫామ్ లో ఉన్న దశలో తండ్రి వంగవీటి రంగాను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేశారు. రంగాకు అప్పట్లో ప్రత్యర్ధులు ఎవరో అందరికీ తెలుసు. రంగాను హత్య చేసే అవకాశం ఎవరికి ఉందో, ఎవరి సహకారం తీసుకున్నారో కూడా రాధాకు తెలుసు. కానీ తండ్రి హత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీలోకే వెళ్లాలని రాధా నిర్ణయించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు సైతం మింగుడు పడలేదు. అదీ వైసీపీలో తాను కోరుకున్న సీటు ఇవ్వనన్నారనే ఒకే కారణంతో. విజయవాడ సెంట్రల్ సీటును రాధా ఆశించగా.. అప్పటికే పార్టీలో ఉన్న తండ్రి రంగా అనుచరుడు మల్లాది విష్ణుకు వైసీపీ దాన్ని కేటాయించింది. కానీ గతంలో రాధా పోటీ చేసిన తూర్పు నియోజకవర్గం కానీ బందరు ఎంపీ సీటు కానీ తీసుకోవాలని కోరినా రాధా పట్టించుకోలేదు. చివరికి ఎంపీ, ఎమ్మెల్యే ఆఫర్ చేసిన పార్టీని కాదని, తండ్రి హత్య ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీలోకి రాధా చేరిపోయారు
టీడీపీకి ప్రచారం- ఓటమితో భవిష్యత్తు అగమ్యగోచరం..
టీడీపీలో రాధా చేరేటప్పటికి ఆయనకు కేటాయించేందుకు ఆ పార్టీలో ఏ సీటు కూడా మిగల్లేదు. చివరికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ప్రచారానికి వాడుకోవాలని టీడీపీ నిర్ణయించింది. స్టార్ క్యాంపెయినర్ అనే ముద్ర వేసి టీడీపీ తరఫున రాధాను ఊరూరా తిప్పినా ప్రయోజనం లేకపోయింది. వైసీపీ హవాలో టీడీపీ దారుణ ఫలితాలు చవిచూసింది. దీంతో సహజంగానే రాధా పరిస్ధితి కూడా దారుణంగా తయారైంది. చివరికి బెజవాడలో తన ప్రత్యర్ధి కుటుంబం నుంచి దేవినేని అవినాష్ ను తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రకటించినా రాధాకు మాత్రం ఏ పదవీ దక్కలేదు.
జనసేన ప్రయత్నాలు విపలం...
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత అంతకంటే దారుణ ఓటమి చవిచూసిన జనసేనలోకి వెళ్లేందుకు రాధా ప్రయత్నాలు చేశారు. జనసేన నుంచి పిలుపు వస్తే చేరేందుకు సిద్దమని సంకేతాలు కూడా పంపారు. సామాజికవర్గంతో పాటు అన్నివిధాలుగా జనసేనలో తనకు ఆదరణ ఉంటుందని ఆయన భావించారు. కానీ అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. తన దగ్గరకే ఎవరైనా రావాలి కానీ తాను ఎవరినీ పిలవబోనన్నది ఆయన వైఖరి. దీంతో రాధాకు అక్కడా చుక్కెదురైంది. చివరికి నానాటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీలో కొనసాగలేక, తిరిగి వైసీపీలోకి వెళ్లలేక ఈ వంగవీటి వారసుడు మథనపడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది.
Recommended Video
వంగవీటి వారసుడికి ఎందుకీ దుస్ధితి ?
విభజన తర్వాత ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వంగవీటి వర్గం ప్రభావశీలంగా ఉంది. వారిలో ఎంతోమంది ఇప్పటికీ రాధాతో టచ్ లోనే ఉన్నారు. కానీ వారంతా రాధా నుంచి ఆశిస్తున్నది వేరు. ఓ రకంగా చూస్తే వారే రాధాకు ప్లస్ అండ్ మైనస్ కూడా అనేది ఇప్పటికీ విజయవాడలో వినిపించే మాట. దీన్ని బట్టి చూస్తే ఎంతో గొప్ప కెరీర్ ముందున్నా.. స్వీయ తప్పిదాలతో తన రాజకీయ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చుకున్న రాధా ఇప్పటికైనా వాస్తవ పరిస్ధితిని గుర్తెరిగి మసలు కోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు