సర్వే లెక్కలు: వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో తిరిగి గెలిచేది వీరే..!
Recommended Video
ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా వార్త ప్రచారంలో ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై పరోక్షంగా సంకేతాలు కూడా ఇస్తుండటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారింది. అప్పుడే సీట్ల పంచాయతీ మొదలైనట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నట్లు సమాచారం. అటు టీడీపీలో ఇమడలేక ఇటు వైసీపీలోకి రాలేక తమలో తామే మదనపడుతున్నట్లు కొందరు ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల పరిస్థితిపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు దక్కించుకున్న వైసీపీలోని నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికొస్తే... వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ కేటాయించాలి... వారి గెలుపు అవకాశాలు ఏమేరకు ఉంటాయన్న దానిపై ప్రభుత్వం ఓ రహస్య సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ సర్వేలో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరని తేల్చి చెప్పిందట.
దీంతో ఖంగు తినడం ఎమ్మెల్యేల వంతైంది. ఇక మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో విజయనగరం జిల్లాకు చెందిన సుజయ కృష్ణ రంగారావు, చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అమరనాథరెడ్డిలు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైందట. ఇక ఈ సర్వేని బట్టి చూస్తే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్ ఇవ్వడం అసాధ్యమేనని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పట్టుబట్టి టికెట్ ఇప్పించుకుని పోటీలోకి దిగినా వారి గెలుపు అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. వచ్చే ఎన్నికలు చాలా కీలకం కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఓడిపోయేవారికి టికెట్ కేటాయిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం ప్రభుత్వ సర్వే లీకై ఫిరాయింపు ఎమ్మెల్యేల చెవిన పడటంతో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు తమకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేదని కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మణిగాంధీ పలుచోట్ల బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదేలా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమానికి హాజరైనా అక్కడ వారికి అసంతృప్తుల సెగ తాకుతుండటం వీరిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో నేతల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి లాంటి చోట్లు ఫిరాయింపు నేతలతో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతున్నారు.
ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి తమ రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రమే ఎమ్మెల్యేలు పరుగులు తీస్తున్నారని స్థానిక నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి తప్ప... టికెట్ ఇచ్చేది లేదనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు అమరావతిలో వార్త షికారు చేస్తోంది.