పోలీసులు అడ్డుపడ్డారు: ఉన్నతాధికారి పేరుతో ముందుకు: బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగింది..!!
గోదావరిలో బోటు బోల్తా ఘటనలో మరణాల సంఖ్య అధికారికంగా ఇప్పటి వరకు 12కు చేరింది. మరో 37 మంది గల్లంతు అయినట్లు అధికారులు చెబుతున్నారు. గాలింపు చర్యలు రాత్రి వరకు కొనసాగించి నిలిపి వేసారు. 300 అడుగులు లోతున బోటు మునిగింది. దీనిని బయటకు తీయగలిగితే గల్లంతు అయిన వారి ఆచూకి తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా స్థానిక అధికారులు..టూరిజం సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే..బోటు ప్రయాణాన్ని స్థానిక పోలీసులు తొలుత అడ్డుకున్నారు. వరద సమయంలో వెళ్లడం కుదరదని చెప్పారు. దీంతో పర్యాటకుల్లో కొందరు.. టిక్కెట్ల విక్రయానికి అనుమతి ఎందుకు ఇచ్చారు.. అంటూ పోలీసులను ప్రశ్నించారు. మరికొందరు ఒక ఉన్నతాధికారి పేరు చెప్పినట్టు సమాచారం. దాంతో పోలీసులు బోటు వెళ్లడానికి అనుమతించి.. అందరూ లైఫ్ జాకెట్లు వేసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఇంతలోనే..ప్రమాదం విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సహాయ చర్యలు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 10 లక్షలు..తెలంగాణ ప్రభుత్వం అయిదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
12 మంది దుర్మరణం 37 మంది గల్లంతు...
గోదావరిలో బోటు బోల్తా ఘటనలో విపత్తు నిర్వహణ శాఖ ప్రకటన ప్రకారం అధికారికంగా 12 మంది దుర్మరణం చెందారు. మరో 37 మంది గల్లంతు అయ్యాు. ఇప్పటి వరకు 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. క్షేమంగా బయటపడ్డవారిలో ఐదుగురు బోటు సిబ్బంది కాగా.. బోటు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లూ మృతి చెందారు. ఇక, గల్లంతైనవారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. వారి ఆచూకీ కోసం హెలికాప్టర్లతో పాటు నేవీ సిబ్బంది, మత్స్యకారులు గాలిస్తున్నారు. అయితే గోదావరిలో 300 అడుగుల కిందకు బోటు మునిగిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోదావరి జిల్లాల మంత్రులు ప్రమాద స్థలి వద్దకు చేరుకున్నారు. రాత్రి వరకు సహాయ చర్యలు కొనసాగించారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటం.. చీకటి కావటంతో సహాయ చర్యలు ముందు సాగలేదు. గుర్తించిన వారి గురించి బంధువలుకు సమాచారం అందించారు. మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షలు..తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ఏపీ సీఎం జగన్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. అయితే..ఈ ఘటన పైన ప్రాధమికంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. దీని పైన సీఎం సీరియస్ అయ్యారు. విధులు నిర్వహిస్తున్న వారి పైన సహాయ చర్యలు పూర్తయిన తరువాత చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
పోలీసులు అడ్డుపడినా.. ఉన్నతాధికారి పేరు చెప్పి..
ఈ విహార యత్రకు బయలుదేరిన వారిలో విశాఖ..రాజమండ్రితో పాటుగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. అయితే అధికంగా తెలంగాణ నుండి వచ్చిన వారుగా గుర్తించారు. పాపికొండల టూర్ కోసం వీరంతా ప్యాకేజీ బుక్ చేస్తున్నారు. వారంతా రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి నుండి బోటు యాజమాన్యం వారిని బస్సుల్లో దేవీపట్నం తీసుకొచ్చింది. అక్కడ శ్రీ వశిష్ఠ పున్నమి రాయల్ అనే బోటు లో ప్రమాణం మొదలైంది. స్థానికంగా అందుతున్న సమాచారం మేరకు బోటులో మొత్తం 73 మంది ఉన్నారు. వారిలో 64 మంది పర్యాటకులు కాగా, మిగిలిన తొమ్మిది మందిలో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు డ్యాన్సర్లు, ముగ్గురు సిబ్బంది. ఉదయం 9.30 గంటల తర్వాత బోటు బయలుదేరగా దేవీపట్నం చెక్ పాయింట్ వద్దకు చేరుకునేసరికి సమయం 11 గంటలైంది. అక్కడ పోలీసులు తనిఖీ చేసి, వరద సమయంలో వెళ్లడం కుదరదని చెప్పారు. దీంతో పర్యాటకుల్లో కొందరు.. టిక్కెట్ల విక్రయానికి అనుమతి ఎందుకు ఇచ్చారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు. మరికొందరు ఒక ఉన్నతాధికారి పేరు చెప్పినట్టు సమాచారం. దాంతో పోలీసులు బోటు వెళ్లడానికి అనుమతించి.. అందరూ లైఫ్ జాకెట్లు వేసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం. అయితే..ఇప్పుడు ప్రభుత్వం ఇదే అంశం మీద ఫోకస్ చేసింది. అసలు వరద ఎక్కువగా ఉన్న సమయంలో వారిని అడ్డుకోకుండా..అనుమతించింది ఎవరు. వారు చెప్పిన ఉన్నతాధికారి ఏం చేసారనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. అయితే..స్థానికంగా కొందరు ముందే ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా సాగుతున్న బోటు ప్రయాణాల గురించి హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదు.
మునిగిన బోటు బయటకు తీస్తేనే..
ప్రమాదం జరిగిన సమయంలో పలువురు తమక ఇచ్చిన లైఫ్ జాకెట్లను తీసేసారు. బోటులోని కింది అంతస్తులో భోజనాలు చేసిన తరువాత వారు అక్కడ ఉక్కపోత కారణంగా లైఫ్ జాకెట్లు తీసేసారు. ఎక్కువ మంది ఒకేసారి ఒకే వైపు ఉన్నారు. అదే సమయంలో ప్రమాదం జరగటంతో వారంతా బోటు కిందకు వెళ్లి పోయి ఉంటారని అంచపా వేస్తున్నారు. అయితే.. గోదావరిలో 300 అడుగుల కిందకు బోటు మునిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దానిని వెలికితీయడం కూడా కష్టంగానే మారింది. ఉధృత ప్రవాహం నేపథ్యంలో దానిని వెదికి తీస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బోటు కూలిపోయినప్పుడు బోటు దిగువ అంతస్తులోని ఏసీ గదుల్లో కొందరు పర్యాటకులు ఉన్నారు. వీరంతా బోటుతో పాటే అడుగుకు వెళ్లిపోయారు. బోటును బయటకు తీయగలిగితే వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలున్నాయి. దీని కోసం ఉత్తరాఖండ్ నుండి ప్రత్యేక సిబ్బందిని ఏపీ ప్రభుత్వం రప్పించింది. టూరిజం మంత్రితో పాటుగా గోదావరి జిల్లాల మంత్రులు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే మకాం వేసారు. అయితే..వరద సమయంలో బోటు ప్రయాణాలకు అనుమతి లేకపోయినా..గత ప్రమాదాలు హెచ్చరిస్తున్నా..ఈ బోటును ఎలా అనుమతించారనే కోణంలో విచారణ జరుగుతోంది. అయితే..ఈ అంశం పై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు.