విషాద ఛాయల్లో నరసరావుపేట: స్వచ్ఛంద బంద్: తెరచుకోని షాపులు.. విద్యాసంస్థలు!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడానికి విషాద ఛాయల మధ్య ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు నరసరావుపేట పట్టణానికి చేరుకుంటున్నారు. గుంటూరు జిల్లా నుంచే కాకుండా.. పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నరసరావుపేటకు వస్తున్నారు. జోహార్ కోడెల అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల శివప్రసాద్ హఠాన్మరణం చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పలువురు కార్యకర్తలు. శోక సముద్రంలో మునిగిపోయారు.
అంత్యక్రియలను దృష్టిలో ఉంచుకుని నరసరావుపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచీ పట్టణవ్యాప్తంగా గంభీరపూరితమైన వాతావరణం నెలకొంది. ఒక్క షాపు కూడా తెరచుకోలేదు. పాఠశాలలు, విద్యాసంస్థలు అనధికారిక సెలవును పాటిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలు పెద్దగా కనిపించట్లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. కోడెల మరణం పట్ల నరసరావు పేట వాసులు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు.
ఆయనను చివరిసారిగా చూడటానికి ఆయన నివాసానికి బారులు తీరుతున్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలను తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- నరసరావుపేట డివిజన్ పరిధిలో మొత్తంలో రెండురోజుల పాటు 144 సెక్షన్ ను విధించారు.
మరి కొద్ది సేపట్లో కోడెల భౌతిక కాయానికి అంతిమ యాత్రను నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక లాంఛనాలను కోడెల కుటుంబీకులు, టీడీపీ నాయకులు నిరాకరించిన నేపథ్యంలో.. పార్టీ తరఫునే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడెల నివాసానికి చేరుకున్నారు.
పలువురు మాజీ మంత్రులు, జిల్లా టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. అధికారిక లాంఛనాలతో కోడెల భౌతిక కాయానికి అంత్యక్రియలను నిర్వహించేలా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నారు. కుమార్తె, కుమారుడితో మాట్లాడుతున్నారు. వారి నుంచి సానుకూల స్పందన రాలేదని కార్యకర్తలు చెబుతున్నారు.