మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని : ట్రాఫిక్ పోలీసులపై చిందులు
ఏలూరు : గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడితో వివాదస్పద నేతగా వార్తల్లోకి ఎక్కిన దెందులూరు ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వైఖరి మరోసారి వివాదస్పదంగా మారింది. ఈ సారి ట్రాఫిక్ పోలీసులపై తన కోపాన్ని ప్రదర్శించిన చింతమనేని, చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ సదరు ట్రాఫిక్ పోలీసులను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
ఏలూరు పాత బస్టాండ్ మీదుగా వెళుతోన్న సమయంలో.. అక్కడి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాయడం గమనించిన చింతమనేని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసులపై మండిపడ్డ చింతమనేనని చలాన్లు ఎందుకు రాస్తున్నారంటూ హెచ్చరించారట. చలాన్లు చెల్లిస్తోన్న వాహనాదారులను అక్కడినుంచి పంపించి వేశారట.
ఇదిలా ఉంటే, గతంలోను ఇలాగే ఓసారి ట్రాఫిక్ విధులకు అడ్డు తగిలారు చింతమనేని. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీసులు.. తమ విధుల్లో చింతమనేనని జోక్యం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తాజా ఆరోపణలపై చింతమనేని ఇంతవరకు స్పందించలేదు.