జనసేన పార్టీలో విషాదం ... నూజివీడు నేత భాస్కరరావు మృతి.. పవన్ సంతాపం
జనసేన పార్టీలో విషాదం నెలకొంది. ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన పార్టీ కీలక నేత మృతి చెందటం జనసేన సైనికుల్లో విషాదం నింపింది. నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్, జనసేన నేత బసవ వైకుంఠ వెంకట భాస్కర్ రావు అనారోగ్యంతో మృతి చెందారు . ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం భాస్కరరావు మరణించారు. పార్టీ నాయకుడు వైకుంఠ వెంకట భాస్కరరావు అకాల మరణం తనను కలచి వేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .
జగన్ ప్రజల్ని నమ్మించి గొంతు కోశారు : జనసేన అధినేత పవన్కళ్యాణ్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం భాస్కరరావు మరణించారనే వార్త విన్న వెంటనే తనకు ఎంతో బాధ అనిపించిందని ఆయన పేర్కొన్నారు. నూజివీడు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడిన పవన్ కళ్యాణ్ ఆయన మరణం ఎంతో విచారకరమని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు ప్రాంతంలో జనసేనను బలోపేతం చేయడానికి భాస్కర్ రావు ఎంతో కృషి చేశారని ఆయన చేసిన కృషిని ఎన్నడూ మరువలేమని చెప్పారు పవన్ కళ్యాణ్.
నూజివీడు రాజకీయాల్లో , పార్టీలో కీలక భూమిక పోషించిన నేత , సౌమ్యుడు , మృధు స్వభావి అయిన వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. భాస్కరరావుకు తన తరపున, జనసైనికుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.