విషాదంగా మిగిలిపోయిన శిరీష-జగదీష్... పెద్దలను ఎదిరించినా విధి ముందు ఓడిపోయారు...
ప్రేమించి పెళ్లి చేసుకున్న సంతోషం ఆ జంటకు ఎంతో కాలం నిలువలేదు. పెద్దలను ఎదిరించి ఒక్కటయ్యారు గానీ విధి ముందు ఇద్దరూ ఓడిపోయారు. పెళ్లయిన నెలన్నరకే భర్త గుండెపోటుతో హఠాన్మరణం చెందగా... ఇటీవల భార్య తీవ్ర మనోవేదనతో మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా కేంద్రంలోని జడ్పీ కాలనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది....
పోలీసుల కథనం ప్రకారం... నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన శిరీష (30) నగరంలోని జీజీహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా పనిచేస్తోంది. స్థానిక జెడ్పీ కాలనీలో ఆమె నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గూడూరు అయ్యవారిపాలేనికి చెందిన జగదీష్తో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న శిరీష-జగదీష్.. ఇరువురి పెద్దలకు విషయం చెప్పారు. అయితే పెళ్లికి వారు ఒప్పుకోలేదు.
అక్టోబర్లో ప్రేమ పెళ్లి...
పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో... వారిని ఎదిరించి గతేడాది అక్టోబర్ 29న ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నెల రోజుల పాటు ఇద్దరు సంతోషంగా గడిపారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. డిసెంబర్లో జగదీష్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో శిరీష ఒంటరిగా మిగిలింది. అయినవాళ్లను కాదని జగదీష్ను పెళ్లి చేసుకున్నందుకు విధి ఇలా వెక్కరించడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.
ఈ నెల 7న శిరీష మృతి
భర్త మరణం తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శిరీష... తోడు కోసం తన స్నేహితురాలు రమాదేవిని పిలిపించుకుంది. ఈ నెల 7న తనకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పిన శిరీష.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో రమాదేవి హుటాహుటిన ఆమెను జీజీహెచ్కి తరలించింది. అయితే అప్పటికే శిరీష మృతి చెందినట్లు జీజీహెచ్ వైద్యులు నిర్దారించారు. ఆమె చేతుల మీద ఇంజెక్షన్లు తీసుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రోధిస్తున్న కుటుంబ సభ్యులు...
శిరీష మృతిపై స్థానిక పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యులు శిరీష మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టమ్ అనంతరం వైద్యులు శిరీష మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిరీష మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.