విషాద ఘటనలు:తండ్రీకొడుకులు...అన్నదమ్ములు...అక్కాచెళ్లెళ్లు మృతి
విజయనగరం,కర్నూలు:రాష్ట్రంలో వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. విజయనగరం జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటనలో తండ్రీ కొడుకులు మృత్యువాతన పడ్డారు.
మరో ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ గంట వ్యవధిలోనే గుండె పోటుతో మృతి చెందిన ఉదంతం స్థానికంగా విషాదం నింపింది. ఒకే రోజు వేర్వేరు కుటుంబాల్లో ఈ విధంగా రక్త సంబంధీకులు ఒకేసారి మరణం బారిన పడటం ఆ కుటుంబాలను పెను విషాదంలో ముంచేయడంతో పాటు ఈ ఘటనలు స్థానికంగా చర్చనీయాంశం అయ్యాయి. వివరాల్లోకి వెళితే...
విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలస గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి వేములపల్లి శ్రీనివాసరావు (38), కొడుకు రోహిత్ (13) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు...తొలుత రోహిత్ మోటర్ బోర్ వద్ద స్నానానికి వెళ్లాడు...అతడు ఎంతకూ తిరిగి రాకపోయే సరికి తండ్రి అక్కడకు వెళ్లాడు. అక్కడ రోహిత్ కింద పడి ఉండటం చూసి కరెంట్ షాక్ గురైనట్లు భావించాడు. అందుకోసమని మోటర్ బోర్ ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో తండ్రి శ్రీనివాస్ కూడా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. తండ్రీకొడుకులు ఈ విధంగా ఒకేసారి మృత్యువాతన పడటంతో కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది.
మరో ఘటనలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో గంట వ్యవధిలో అన్నాదములు గుండెపోటు కారణంగా మృత్యువాతన పడ్డారు. గ్రామానికి చెందిన నాగరాజు(37) అనే వ్యక్తికి గుండెపోటు రాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. అయితే ఈ విషయం కాసేపటికి అతడి తమ్ముడు మల్లయ్యకు తెలిసింది. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన మల్లయ్యకూ గుండెపోటు వచ్చింది. దీంతో మల్లయ్య కూడా మృతిచెందాడు. కేవలం గంట వ్యవధిలో అన్నదమ్ములు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మరోవైపు చెక్డ్యామ్లో పడి అక్కా చెల్లెలు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. యాదమర్రి మండలం బొమ్మనచేను గ్రామానికి చెందిన ఇందు(13) మోనిషా(7)లు అక్కా చెల్లెళ్లు. శుక్రవారం ఉదయం చెక్డ్యామ్ వద్ద నీళ్ళలో ఆడుకోవడానికి వెళ్ళిన వీరిద్దరూ నీళ్ళల్లో పడిపోయారు. అనంతరం నీళ్లల్లో మునిగి ఊపిరాడక మృతిచెందారు. ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు విగత జీవులుగా మారడంపై ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.