కోర్టు చెప్పినా తెలంగాణ నో: రోడ్డున ఏపీ నేటివిటీ ట్రాన్స్కో ఉద్యోగులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం 1400 మంది ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయడంపై ఫిర్యాదు చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తమను విధుల్లో నుంచి రిలీవ్ చేయడం ఆర్టికల్ 371డీకి వ్యతిరేకమని ఏఅపీ విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. పదోన్నతుల కోసమే కొందరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కొత్తగూడెం థర్మల్ ప్లాంటులో ఏపీ ఉద్యోగుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, అందులో ఫోటో ఉన్నవారినికూడా లోనికి అనుమతించలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిలీవ్ ఆర్డర్లు ఇచ్చిందన్నారు. తెలంగాణ అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
విధులు నిర్వర్తించకుండా అడ్డుంటున్నారని, క్వార్టర్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఓటు హక్కు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నప్పటికీ తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని గవర్నర్ను కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
కాగా, ఆంధ్రా నేటివిటీ ఉన్న 1400 మంది ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్కో ఏపీకి బదలాయిస్తూ విధుల నుండి రిలీవ్ చేసింది.
తెలంగాణ సర్కారు నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఉన్నపళంగా రిలీవ్ సరికాదని హైకోర్టు తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని నిలుపుదల చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విధుల నుంచి రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవడంలో తెలంగాణ సర్కారు ఆసక్తి చూపించడం లేదు.