చంద్రబాబుకు గుడి కట్టబోతున్నారు! ఎవరో, ఎక్కడో.. తెలుసా?
కర్నూలు: వాళ్లు కనిపిస్తే చాలు.. కొందరు ఆమడదూరం జరుగుతారు, మరికొందరు చీదరించుకుంటారు. అందరిలాగే పుట్టిన మనుషులే అయినా సమాజంలో అందరూ వారిని చిన్నచూపు చూస్తుంటారు. విధి ఆడిన వింతనాటకంలో ఓటమిపాలై వారంతా బతుకు పోరాటంలో భిక్షాటననే జీవనమార్గంగా ఎంచుకున్నారు. అలాంటి వారి ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది.
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారిప్పుడు సాక్షాత్తు దేవుడిలా చూస్తున్నారు. అంతేకాదు, ఆయనకు గుడి కూడా నిర్మించాలనుకుంటున్నారు. సమాజంలోని మూడో వర్గమైన హిజ్రాలకు కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసింది.
హిజ్రాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. వారికి రేషన్ కార్డు, ఇళ్లు, ప్రతి నెల రూ.1500 పింఛను, చదువుకున్న హిజ్రాలు వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించిందని, అందుకే ఆయనకు గుడిని నిర్మించాలనుకుంటున్నామని వారు తెలిపారు.
నంద్యాల నుంచి మహానంది వెళ్లే దారిలో గుడి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణ కూడా జరిగిందని హిజ్రాల సంక్షేమ సంఘం నాయకుడు విజయ్ కుమార్ తెలిపారు. ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఇప్పటికే చాలా మంది దాతలు ముందుకొచ్చినట్లు తెలిపారు.