ఏర్పేడు : లెర్నింగ్ లైసెన్స్ తో హెవీ వెహికిల్ డ్రైవింగ్, ఇసుక స్మగర్లకు చెక్ ఇలా..
చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడు రోడ్డు ప్రమాదానికి గల కారణాలను రవాణాశాఖ ఆరా తీస్తోంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గురవయ్యను రవాణాశాఖ అధికారులు ఆరాతీశారు. ఎల్ ఏం వీ లైసెన్స్ మాత్రమే కలిగి ఉండి హెవీ వెహికిల్ ను నడపడంపై రవాణాశాఖాధికారులు ఆశ్చర్యపోయారు.
చిత్తూరు జిల్లాలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను రవాణాశాఖాధికారలు విచారిస్తున్నారు.
రవాణాశాఖ విజిలెన్స్ కమిషనర్ ప్రసాదరావు ఏర్పేడులోని ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులను ఆయన స్థానికంగా ఉన్న రవాణాశాఖాధికారులతో చర్చించారు.
ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు చాలా చిన్నగా ఉన్న కారణంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందనే అభిప్రాయాన్ని రవాణాశాఖాధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ఏంవీ లైసెన్స్ తో పదిచక్రాల లారీ నడుపుతున్న డ్రైవర్
ఏర్పేడు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గురవయ్య ఎల్ ఏం వీ లైసెన్స్ కలిగి ఉన్నాడు. అయితే నిబంధనలకు విరుద్దంగా పది చక్రాల లారీని నడపుతున్నాడని రవాణాశాఖ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా పదిచక్రాల లారీని ఎలా నడుపుతున్నావని రవాణాశాఖ అధికారులు ప్రశ్నించారు. పది చక్రాల లారీని ఎవరు ఇచ్చారు. ఈ వాహన డ్రైవర్ ఎవరు అంటూ రవాణాశాఖాధికారులు డ్రైవర్ గురవయ్యను ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన సంఘటనస్థలాన్ని రవాణాశాఖాధికారులు పరిశీలించారు.
ఇరుకు రోడ్డే కారణమా?
ఆరు మాసాల కాలంలో ఎన్నిసార్లు తనిఖీ చేశారని రవాణాశాఖ విజిలెన్స్ కమిషనర్ ప్రసాదరావు తిరుపతి రవాణాశాఖ ఇన్ చార్జి ఆర్టీవో సురేష్ నాయుడును ప్రశ్నించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిని జైలుకు పంపారు.ఎంతమందికి శిక్షపడిందని ఆయన ప్రశ్నించారు.తిరుపతి-శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలోని ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని రవాణాశాఖాధికారులు గుర్తించారు.
తహాసీల్దార్ ఎక్కడ?
మునగలపాలెం రైతులకు శుక్రవారం తన కార్యాలయంలో కన్పించని ఏర్పేడు తహాసీల్దార్ వెంకట్రాములు హైద్రాబాద్ లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ భూ వ్యవహరాలకు సంబంధించి హైకోర్టులో వాయిదా ఉండడంతో ఆయన హైద్రాబాద్ కు వెళ్లారని చెబుతున్నారు.అయితే ఈ విషయం తెలియని మునగలపాలెం రైతులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గురై మరణించారు.
మీకు బిడ్డను అవుతా, స్మగ్లర్ల ఆటకట్టిస్తా
మునగలపాలెం గ్రామానికి బిడ్డనై తాను అన్ని రకాలుగా ఆదుకొంటానని ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ఇసుక స్మగ్లర్ల ఆటకట్టిస్తానని చెప్పారు. ఇద్దరు వెధవల వల్ల ఊరికి కష్టం వచ్చింది. ఆ ఇద్దరు వెధవలను వదిలిపెట్టేది లేదన్నారు లోకేష్.శనివారం నాడు లోకేష్ మంత్రులతో కలిసి మునగలపాలెం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.
అన్నయ్యగా ఆదుకొంటానని మహిళకు లోకేష్ హమీ
ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో భర్త కోదండపాణి, మామ ఈశ్వరనాయుడులను కోల్పోయిన ఓ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించడంతో మంత్రి లోకేష్ చలించిపోయారు. అమ్మా జరగకూడదనిది జరిగిపోయింది. బాధపడొడ్డు. మీ అన్నయ్య ఉన్నాడని సాంత్వన పరిచారు. ఆమెకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్థులు కోరగా, చెల్లివిషయం తనకు వదిలపెట్టాలన్నారు. పెద్ద కర్మలు అయ్యాక, తానే స్వయంగా అమరావతికి పిలిపించుకొని కష్టాలు వింటానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఇసుక ట్రాక్టర్లు గ్రామానికి రావు
గ్రామానికి ఇసుక ట్రాక్టర్లు రావని మంత్రి లోకేష్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇసుక తరలింపును నిరసిస్తూ గ్రామస్థులు చేసిన పోరాటాన్ని మంత్రి అభినందించారు. ఈ విషయమై తాను హమీ ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.ఇసుక అక్రమరవాణాను అరికడతానని మంత్రి హమీ ఇచ్చారు.