విజయవాడ టు ఢిల్లీ: సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించిన తెలుగోడి గుండె..!
విజయవాడ/న్యూఢిల్లీ: ఓ తెలుగువాడి గుండె దేశ రాజధాని వరకూ ప్రయాణించింది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న మరొకరికి ఊపిరి పోసింది.అవయవ మార్పిడిలో భాగంగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి సేకరించిన గుండెను సుమారు మూడున్నర గంటల వ్యవధిలో దేశ రాజధానికి తరలించారు. 1400 కిలోమీటర్లకు పైగా ఉన్న దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరవేయడానికి గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న ఒకరికి గుండెను మార్పిడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఫోర్టిస్ ఆసుపత్రి డాక్టర్లు దేశవ్యాప్తంగా తమకు ఉన్న నెట్ వర్క్ ద్వారా పలు ఆసుపత్రులను సంప్రదించారు. చివరికి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె లభించింది. ఓ మనిషి శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత ఆరు గంటల వరకూ అది పని చేస్తూనే ఉంటుందనే విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు గంటల్లో ఆ గుండెను మరొకరికి అమర్చాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో- దేశ రాజధాని వరకూ ఆ హృదయాన్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా తేలికపాటి విమానాన్ని ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ గుండెను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఖ్లాలోని ఫోర్టిస్ ఆసుపత్రి వరకు మధ్య దూరం సుమారు 23 కిలోమీటర్లు. సాధారణంగా దేశ రాజధానిలో ఉన్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కనీసం రెండున్నర గంటల సమయం పడుతుంది.
వాహనాలు ఏవీ అడ్డురాకుండా.. ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి ఫోర్టిస్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. విమానం నుంచి ల్యాండ్ అయిన వెంటనే రన్ వే మీద అందుబాటులో ఉంచిన ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ లో ద్వారా దాన్ని తరలించారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల 23 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 19 నిమిషాల్లో అధిగమించారు. సకాలంలో గుండెను ఆసుపత్రికి చేర్చారు.