హైద్రాబాద్లో నిజాం కాలంనాటి సొరంగం: నిధిపై పుకార్లు
నిజాంల వద్ద ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వహించిన మహారాజా చందూలాల్ నిర్మించిన బాలాజీ ఆలయ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా వెలువడిన సొరంగంపై రకరకాల ఊహాగాలు వెలువడుతున్నాయి. నిజాం పాలకులకు భయపడి అప్పట్లో రాజు తన వద్ద నున్న బంగారు-వెండి ఆభరణాలు, నాణేలు, విలువైన వజ్ర, వైఢూర్యాలను అల్వాల్లోని వెంకటేశ్వర ఆలయానికి కానుకగా సమర్పించారని ప్రచారంలో ఉంది.
అప్పట్లో దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు వాటిని నేలమాళిగలో భద్రపరచినట్టుగా చెబుతుంటారు. ప్రస్తుతం బయటపడిన సొరంగంలో ఏమైనా దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిని నిర్ధారించేందుకు పురావస్తు శాఖ నిపుణులు రంగంలోకి దిగనున్నారు. బుధవారం ఈ ప్రాంతాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో సొరంగాన్ని పరిశీలిస్తామని పురావస్తు, మ్యూజియంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణారావు తెలిపారు.
అల్వాల్లో బయటపడిన పురాతన నిర్మాణంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నిర్మాణాలు 15 లేదా 16వ శతాబ్ద కాలంలో నిర్మించినవిగా భావిస్తున్నారు. గోల్కొండ కేంద్రంగా కులీకుతుబ్షాలు పాలించిన కాలంలో వైష్ణవమత ఆచార్యులు ఆళ్వారులు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లేవారు. ఆళ్వారులు తరుచూ సందర్శించే ప్రాంతం కావడంతో అల్వాల్గా పేరు వచ్చినట్టు చెబుతారు. ఆ తర్వాత నిజాంల వద్ద ప్రధానిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసిన రాజా చందూలాల్ ఈ ప్రాంతంలో తన ఆరాధ్య దైవంగా భావించే బాలాజీ మందిరాన్ని క్రీశ.1841లో నిర్మించారు.
ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఆలయం ముందున్న కోనేరు బావిలో స్నానం చేస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయనే విశ్వాసం ఉండేది. ఆ తర్వాత నిజాంల వద్ద ప్రధానమంత్రిగా పనిచేసిన మహారాజా కిషన్ ప్రసాద్ విలువైన ఆభరణాలు, బంగారు, వెండి నాణేలు స్వామివారికి కానుకగా సమర్పించినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో స్వామివారికి అందించిన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన కానుకలను భూగర్భంలో భద్రపరిచినట్టు ప్రచారం జరుగుతోంది.
అల్వాల్కు చెందిన ఓ కుటుంబానికి అల్వాల్ సర్కిల్ కార్యాలయ సమీపంలో సుమారు 600 గజాల స్థలం వంశ పారంపర్యంగా సంక్రమించింది. ఈ స్థలంలో స్టిల్ల్ ప్లస్ 4 అంతస్థుల భవన నిర్మాణం చేపట్టాలని వీరు నిర్ణయించారు. జిహెచ్ఎంసి నుంచి కొద్ది రోజుల క్రితం అనుమతి తీసుకున్నారు. శరత్ అనే బిల్డర్కు డెవలప్మెంట్ కోసం అప్పగించగా పునాదుల కోసం తవ్వకాలు ప్రారంభించారు. 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపిన తరుణంలో మంగళవారం పురాతన బావి, దాని పక్కనే సొరంగం బయటపడ్డాయి.