హైదరాబాద్ నిమ్స్లో భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఛాతి నొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం నేతలు తమపై దాడి చేశారని పెట్టిన కేసులో భూమా నాగిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
నిమ్స్ పాత భవనం ఐసిపియూ బెడ్ నెంబర్ 6లో ఆయనను అడ్మిట్ చేశారు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో స్థానిక పోలీసులు నవంబర్ 1న అరెస్ట్ చేశారు. రిమాండ్లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆస్పత్రిలో చేర్చారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3న్నర గంటల ప్రాంతంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షలు చేసిన గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి ఆయనను తరలించాలని పోలీసులకు సూచించారు. దీంతో భూమా నాగిరెడ్డిని మంగళవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో కార్డియాలజీ ఐసిసియు విభాగం నుంచి హైదరాబాద్ నిమ్స్కు అంబులెన్స్లో పోలీసు ఎస్కార్ట్తో తరలించారు.