సభ రసాభాస: ‘రేణుకా హటావో.. కాంగ్రెస్ బచావో’ నినాదాలు
ఖమ్మం: జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ జాతీయ నేత కుంతియాతోపాటు రాష్ట్ర నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్కు మంచిరోజులు రావాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని గిరిజన సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి.
'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి నా భర్త నుంచి రేణుకా చౌదరి రూ. కోటి 20 లక్షలు తీసుకున్నారు. అయినా టికె ట్ ఇప్పించలేదు. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుంటా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడు' డాక్టర్ రాంజీ భార్య అన్నారు. గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు.
మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిధిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘రేణుకా హటావో కాంగ్రెస్ బచావో' అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాంజీ భార్య.. కుంతియాకు వినతి పత్రం అందించారు. రేణుకా చౌదరి తీసుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని కోరారు. సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళతామని వారు హామీ ఇచ్చారు.