ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై కర్రలతో తెరాస దాడి, కేసీఆర్పై జానా ఆగ్రహం
మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో చిన్నారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో ఆయన సోమవారం పర్యటించారు.
ఖిల్లా ఘనపురంలో తెరాస నేతలు ఓ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అదే గ్రామంలో ఉన్న ఎంపీటీసీని ఆహ్వానించకపోవడంతో ఆయన దానిని ప్రశ్నించారు. దానికి పలువరు అతడి పైన దాడికి పాల్పడ్డారు. చెప్పుతో కూడా కొట్టినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఆయన నియోజవర్గం ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి సర్పంచ్, ఇతర అధికారులను నిలదీశారు. దీంతో కొంతమంది యువకులు చిన్నారెడ్డిని, ఆయన అనుచరులను కర్రలతో కొట్టారు. వారు తెరాస వారిగా చెబుతున్నారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి.
చిన్నారెడ్డి పైన దాడి విషయంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన చిన్నా రెడ్డి పైన దాడి దారుణమని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమన్నారు. బాధ్యుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గొడవ జరుగుతుంటే తమాషా చూస్తున్నారా ఆయన పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసుల తీరును తప్పు బట్టారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు. తెరాస తీరును ప్రజలు గమనిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్కు, ప్రజలు బుద్ది చెబుతారన్నారు.
తమ పార్టీ నేతలపై మరోసారి దాడి చేస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెరాస నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారిని అదుపులో పెట్టాలని సీఎం కేసీఆర్కు సూచించారు.