'జగ్గారెడ్డిని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు, అవమానం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆదివారం మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ గురించి జగ్గారెడ్డి బయటపెడతారనే భయం తెరాసలో కనిపిస్తోందన్నారు. జగ్గారెడ్డిని చూసి తెరాస నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. మెదక్ జిల్లా ప్రజలను కేసీఆర్ చాలాసార్లు అవమానించారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం మూడు నెలల పాలన పైన చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెరాస పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. తేరాస నేతలు ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం మద్దతును ఎలా కోరుతున్నారె చెప్పాలన్నారు.
మెదక్ ఉప ఎన్నికల్లో తెరాస మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్ నిర్ణయాలపై మెదక్ ఉప ఎన్నికల్లో ప్రజల ముందే తేల్చుకుంటామన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళల పైన వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయన్నారు.
ఇదేనా మీరు కోరుకుంటున్న బంగారు తెలంగాణ అని కేసీఆర్ను ప్రశ్నించారు. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.
మాసాయిపేట ఘటనలో కనీసం బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ రాలేదన్నారు. ఇటీవల ఇళ్ల కూల్చివేత ఘటన పైన, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంపై చర్చకు ప్రజల్లోకి వెళ్దామా అన్నారు. కేసీఆర్, తెరాస గురించి జగ్గారెడ్డి బయటపెడతారని, ఆయన పైన కేసు ఉందని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు బీజేపీ బెదరదన్నారు.
జగ్గారెడ్డిపై నోముల
జగ్గారెడ్డి పైన తెరాస నేత నోముల నర్సింహయ్య ధ్వజమెత్తారు. జగ్గారెడ్డి కేవలం సమైక్యవాదే కాదని, అవకాశవాది కూడా అన్నారు. సద్విమర్శలు చేస్తే తాము స్వీకరిస్తామని, ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
విజయం మాదే: హరీశ్ రావు
మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికల్లో విజయం తమదేనని టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ధీమాగా చెప్పారు. బరిలో నిలిచిన మిగిలిన పార్టీలన్నీ రెండో స్థానానికే పోటీ పడుతున్నాయని ఆయన ఆదివారం నాటి ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంతో పాటు, హైదరాబాద్ లో గవర్నర్ పాలనకు మొగ్గుచూపిన కేంద్రానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
రాష్ట్ర విభజనే వద్దని వాదించిన జగ్గారెడ్డికి అసలు ఓట్లడిగే హక్కే లేదన్నారు. జగ్గారెడ్డిని బరిలో దింపడం ద్వారా బీజేపీ తమ విజయాన్ని మరింత సులభతరం చేసిందన్నారు. మూడు నెలల క్రితం ఓటమిపాలైన సునీతా లక్ష్మారెడ్డిని అంతలోనే ప్రజలెలా ఆదరిస్తారన్నారు.