కేవీపీ ప్రైవేట్ బిల్లు: కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్, వైసీపీ ఎంపీలతో వెంకయ్య
న్యూఢిల్లీ: గడచిన ఎన్నికల్లో ఏపీలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల అభిమానాన్ని చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు.
జులై 22 ఏపీకి ఎంతో కీలకం: కేవీపీ బిల్లుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ
ఈ బిల్లుపై ఈనెల 22న చర్చ, ఆ తర్వాత ఓటింగ్ జరగనుండటంతో యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లును పాస్ చేయించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి మంతనాలను జరుపుతోంది.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలతో కూడా కాంగ్రెస్ చర్చించనుంది. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతుని కోరుతూ బుధవారం ఆ పార్టీకి చెందిన ఎంపీ కేకేని కలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మరోవైపు వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ భేటీ జరగనుంది. ఈ భేటీలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాజ్యసభకు తప్పనిసరిగా హాజరు కావాలని రాజ్యసభ సభ్యులకు విప్ జారీ యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్ధీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కేవీపీ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 22న చర్చకు రానున్న ప్రత్యేకహోదా బిల్లు నెగ్గేందుకు అధికారపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే సమయమని ఆయన చెప్పారు. ఈ బిల్లును పాస్ చేసుకోవడంలో ఏపీకి చెందిన ప్రతి ఒక్కనేత భాగస్వామి కావాలని ఆయన సూచించారు. రాష్ట్రప్రయోజనాలు కాపాడుకునేందుకు అంతా కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కేంద్రంతో పోరాడాల్సిన సమయం ఇదేనన్నారు. ప్రైవేట్ బిల్లుకు అందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో జీఎస్టీ బిల్లు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం విషయమై వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడారు.
ఈ రెండు అంశాలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారని, అందుకు తాము సరేనని చెప్పామని ఆ ఇద్దరు ఎంపీలు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ ఎన్నో పోరాటాలు చేశారని, పార్లమెంట్లో అనేక సార్లు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తామని, ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు కూడా చేశామని వారు పేర్కొన్నారు.
రాజ్యసభలో కేవీపీ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ బిల్లు ఎవరు పెట్టారనే దాని కన్నా ఏపీకి ప్రత్యేక హోదా రావడమే ముఖ్యంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఓటింగ్లో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ చేయించేందుకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరారెడ్డి బృందం ఢిల్లీలోని ప్రధాన పార్టీలకు చెందిన నేతలతో భేటీ అయిన చర్చిస్తున్న సంగతి తెలిసిందే.