ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించండి: టి ఎంపీలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ను తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు జితేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బాల్క సుమన్లు కోరారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటులో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ వరకూ వెళుతున్న గ్యాస్ పైపులైన్ ద్వారానే రామగుండం ఎరువుల కర్మాగారానికి కూడా గ్యాస్ను సరఫరా చేసేలా చూడాలని కోరామన్నారు. దీనిపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కూడా కలుస్తామన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు గాను ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటయ్యిందని, ఇందులోని జాతీయ ఎరువుల లిమిటెడ్, ఇంజనీర్స్ లిమిటెడ్లకు ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
దేశంలో యూరియా కొరత పెరిగిన నేపథ్యంలో రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారం మొదలైతే తెలంగాణలోని రైతులకు ఎరువులు, యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.