కిరణ్ రెడ్డిపై మాట్లాడలేదేం!: 'రాజయ్య' దాడికి 'శంకర్రావు' కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మంత్రివర్గం మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను బర్తరఫ్ చేయడాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ మంత్రి శంకర రావును చూపించి కాంగ్రెస్ పార్టీ పైన ఎదురు దాడికి దిగుతోంది.
తెరాస తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థిస్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు డబుల్ స్టాండ్ ఇప్పుడు కనిపిస్తోందని తెరాస ఆరోపిస్తోంది.
దళిత వర్గానికే చెందిన శంకర రావును నాడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొలగించినప్పుడు ఇదే నేతలు ఎందుకు మాట్లాడలేదని తెరాస ప్రశ్నిస్తోంది. అప్పుడు మౌనం వహించి, ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటున్నారు. కాంగ్రెస్ నేతల మాటలు చూస్తోంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటున్నారు.
టీడీపీ పైన కూడా తెరాస ఎదురు దాడికి దిగుతోంది. టీడీపీ నేతలు ఆంధ్రా భవన్లో (ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఉద్దేశించి) కూర్చొని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి కోవర్టులుగా మాట్లాడుతున్నారని దుయ్యబడుతున్నారు. పద్నాలుగేళ్లుగా కేసీఆర్ను టార్గెట్ చేసినప్పటికీ ప్రజలు మాత్రం కేసీఆర్నే ఆదరిస్తున్నారన్నారు.