తలసాని, తుమ్మల 'గ్రేటర్' ప్లాన్: ఏపీ ఓటర్లను దువ్వుతున్న కేసీఆర్
హైదరాబాద్: రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరంలోని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ఓటర్లను బుజ్జగించేందుకు నగర తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ ఓటర్ల సంఖ్య కూడా చాలానే ఉంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలతో పాటు... సనత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినా తెరాస వైపు ఏపీ ఓటర్లు ఉండేలా తెరాస నాయకులు పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందుకోసం నగరంలో ఉన్న ఆయా కమ్యూనిటీల నేతలతో తెరాస నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
మంత్రులు తలసాని, తుమ్మల నాగేశ్వర రావు, ఇతర సీనియర్ నేతలు నగరంలో బలంగా ఉన్న కమ్మ వ్యాపారవేత్తలతో మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎన్నికలు వస్తే తెరాస వైపు నిలబడాలని వారు కోరుతున్నారు. తలసాని, తుమ్మల నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, కమ్మ, టీడీపీ ఓటర్లను తమ వైపుకు తెచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడు తెరాస అభ్యర్థులను గెలిపిస్తే మీ భద్రతకు హామీ ఉంటుందని, మద్దతుగా నిలబడతామని వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యాపారం లేదా బతుకుదెరువు కోసం ఇక్కడకు వచ్చిన వారికి తెరాస వ్యతిరేకం కాదని, లూటీ చేసిన వారికి మాత్రమే వ్యతిరేకమని వారు చెబుతున్నారంటున్నారు.
ఆయా అపార్టుమెంట్లలో ఉండే సీమాంధ్ర ముఖ్యులు, ఆయా సంఘాల నేతలతో వీరు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
నగరంలో ఉండే సీమాంధ్రులు సాధారణంగా టీడీపీ - బీజేపీ కూటమికి ఓటు వేస్తారని, అయితే, అందుకు 2014 ఎన్నికలలో నగరంలో టీడీపీ - బీజేపీ కూటమి గెలుచుకున్న సీట్లే నిదర్శనమని అంటున్నారు. అయితే, కంటోన్మెంట్ ఎన్నికలను ఉదారహణ చూపుతూ పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో తెరాస గెలిచిన విషయం తెలిసిందే.