"ఏపీలో టీఆర్ఎస్ పోటీ!?.. ఆ రెండు చోట్ల పోటీ చేస్తే పక్కా విజయం.."
వచ్చే ఎన్నికల్లో గనుక జగ్గయ్యపేట, నందిగామల్లో పోటీ చేస్తే ఏపీలోను టీఆర్ఎస్ గెలుస్తుందని జగదీశ్ రెడ్డి తెలిపారు.
కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తితో ఉంది. నాయకత్వంలోను, పార్టీ సమర్థతలోను టీఆర్ఎస్ కు పోటీగా నిలబడగలిగే ప్రత్యామ్నాయం ప్రస్తుతం లేదనే చెప్పాలి. అదే సమయంలో టీఆర్ఎస్ పాలన పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే పక్క రాష్ట్రం ఆంధ్రాతో పోలిస్తే టీఆర్ఎస్ పాలన మెరుగ్గానే ఉందనేది మరికొందరి వాదన.
అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోను కేసీఆర్, కేటీఆర్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి కనబరిచేవారు ఈమధ్య రోజుల్లో ఎక్కువయ్యారు. అడపాదడపా అక్కడక్కడ వీరి ఫ్లెక్సీలు ఏపీలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై గతంలో కేటీఆర్ ఓ సరదా వ్యాఖ్య కూడా చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే.. భీమవరం నుంచి పోటీ చేస్తుందని, కోళ్ల పందేలకు అనుమతులిస్తే చాలు.. అక్కడి ప్రజలు తమకే పట్టం కడుతారని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
తాజాగా ఏపీలో టీఆర్ఎస్ పోటీ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఈసారి మంత్రి జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పోటీ చేస్తే ఆంధ్రాలోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.సీఎం కేసీఆర్ పాలన పట్ల ఏపీ ప్రజల్లోను మంచి అభిప్రాయం ఉందని, వచ్చే ఎన్నికల్లో గనుక జగ్గయ్యపేట, నందిగామల్లో పోటీ చేస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఆదివారం నాడు సూర్యాపేట జిల్లా కోదాడలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.