శిల్పాకు అఖిలప్రియ 'ఉచిత' సలహా, పోలీసులకు దొరక్కుండా శిల్పా పారిపోయారు
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ ఓ సలహా ఇచ్చారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ ఓ సలహా ఇచ్చారు.
నంద్యాలలో తాము లోకల్ అని భూమా కుటుంబం మొదటి నుంచి చెబుతోంది. శిల్పా సోదరులు (శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలు మాత్రం నాన్ లోకల్ అని చెబుతూ వస్తున్నారు.
అఖిల వర్సెస్ శిల్పా
ఇప్పుడు, నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. ఈ క్రెడిట్లో ఎక్కువ భాగం మంత్రి అఖిలప్రియకే దక్కింది. ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి పోటీ చేసినప్పటికీ అఖిలప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపు అనంతరం అఖిలప్రియ.. శిల్పాకు ఓ సలహా ఇచ్చారు.
కర్నూలును వదిలి, కడపలో ప్రయత్నించండి
కర్నూలులో ఓడిపోయిన మీరు, ఇక మీ సొంత జిల్లా కడపలో మీ రాజకీయ లక్కును పరీక్షించుకోవాలని అఖిలప్రియ హితవు సూచించారు. 2019లో కూడా శిల్పా సోదరులకు కర్నూలు జిల్లాలో గెలుపు ఉండదని, కడపలో చూసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు
శిల్పా చక్రపాణి రెడ్డి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని అఖిలప్రియ ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలుపు తర్వాత శిల్పా సోదరులు నంద్యాలను వదిలి పారిపోయారని ఎద్దేవా చేశారు.
నంద్యాలను వదిలి వెళ్లిపోండి
నంద్యాలలో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారని అఖిలప్రియ గుర్తు చేశారు. ఇచ్చిన మాట మేరకు రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. కాబట్టి శిల్పా సోదరులు కర్నూలును వదిలి వెళ్లిపోవాలన్నారు.