కేంద్రం వద్దన్నా పంతం నెగ్గించుకున్న జగన్- ఏపీ క్యాడర్కు ఐఏఎస్ శ్రీలక్ష్మి- ఆ లొసుగు వల్లే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పలు కీలక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆయన మరణానంతరం జగన్ అక్రమాస్తులు, గాలి జనార్ధన్రెడ్డికి చెందిన ఓబుళాపురం కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. స్వతహాగా ఏపీకి చెందిన ఆమె రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ క్యాడర్కు వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకూ ఏపీ క్యాడర్లో ఉన్నా పోస్టల్ అడ్రస్ కారణంగా ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహరాలశాఖ డీవోపీటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వైఎస్ కుటుంబం అన్నా జగన్ అన్నా వ్యతిరేకత కనబరిచే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన శ్రీలక్ష్మి .. మళ్లీ జగన్ అధికారంలోకి రాగానే ఏపీ క్యాడర్కు వచ్చేందుకు భారీ ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్ సాయంతో ఆమె చేసిన ప్రయత్నాలకు కేంద్రం అంగీకరించలేదు. ఎట్టకేలకు ఆమె క్యాట్ ఉత్తర్వులతో ఏపీ క్యాడర్కు మారిపోయారు.
Recommended Video
వైఎస్ హయాంలో ఓ వెలుగు...
వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా గనుల శాఖలో కార్యదర్శిగా ఉంటూ క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగిస్తూ గాలి జనార్దన్రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకు మేలు చేశారు. తద్వారా గాలి జనార్ధన్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడేందుకు సహకరించారనేది ఆమెపై ఆరోపణ. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శ్రీలక్ష్మి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే వైఎస్ మరణం తర్వాత ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు జగన్పై దాఖలైన సీబీఐ అక్రమాస్తుల కేసుల్లోనూ శ్రీలక్ష్మిని నిందితురాలిగా చేర్చింది.
సీబీఐ కేసుల్లో అష్టకష్టాలు..
వైఎస్ మరణం తర్వాత శ్రీలక్ష్మిని ఓబుళాపురం మైనింగ్ అక్రమాలతో పాటు జగన్ అక్రమాస్తుల కేసు కూడా వెంటాడాయి. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసి ఆమెను జైలుకు కూడా పంపింది. దీంతో ఆమె మానసికంగా, శారీరకంగా కుంగిపోయారు. ఓ దశలో ఉద్యోగాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధమ్యయారని చెబుతారు. చివరికి రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ తెలంగాణ క్యాడర్కు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్ధల వ్యవహారాలను ఆమెకు అప్పగించింది. వాస్తవానికి ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ఆమె ఏపీ క్యాడర్కు రావాలని భావించినా వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తనకు కష్టాలు తప్పవని భావించి ఆగిపోయారు.
జగన్ రాకతో ఏపీకి వచ్చేందుకు రెడీ...
ఏపీలో గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు గతంలో తన తండ్రి హయాంలో పనిచేసిన పలువురు అధికారులను జగన్ తెచ్చిపెట్టుకున్నారు. ఇదే కోవలో తనకూ అవకాశం దక్కుతుందని భావించిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది. చివరికి సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్లోనే పనిచేయాల్సి వచ్చింది.
ఫలించిన వ్యూహం- ఎట్టకేలకు సొంత రాష్ట్రానికి...
సెక్రటరీ స్దాయి అధికారులను పొరుగు రాష్ట్రాలకు డిప్యుటేషన్కు పంపేందుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో శ్రీలక్ష్మి క్యాట్ను ఆశ్రయించారు. తాను ఏపీలోని విశాఖపట్నంలోనే పుట్టి పెరిగానని, అయితే తన తండ్రి రైల్వే ఉద్యోగం కారణంగా హైదరాబాద్ వచ్చానని, ఇక్కడి పోస్టల్ అడ్రస్ కారణంగా తనను తెలంగాణ క్యాడర్కు కేటాయించారని క్యాట్లో శ్రీలక్ష్మి వాదించారు. కాబట్టి తనను సొంత రాష్ట్రానికి పంపాలని ఆమె చేసిన వాదనను క్యాట్ అంగీకరించింది. దీంతో ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం, ఆమె వెంటనే అమరావతి వచ్చి ఏపీ ప్రభుత్వంలో చేరడం చకచకా జరిగిపోయాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు కేంద్రం వద్దన్నా క్యాట్ సాయంతో ఆమె సొంత రాష్ట్రానికి రావడం ఆసక్తికరంగా మారింది.