రాజధానిపై మోడీకి టీఎస్సార్ హెచ్చరిక! వెయ్యేళ్ల నష్టం..
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని తిరుపతిలో చేసిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. వెంకన్న సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే బాలాజీ క్షమించరని బుధవారం రాజ్యసభలో మోడీని హెచ్చరించారు.
ఏపీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించేందుకు వెంటనే రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింద రూ.15,691 కోట్లను మంజూలు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్నుల్లో రాయితీలు, ప్రత్యేక అభివృద్ది ప్యాకేజి తదితర హామీలను నిలబెట్టుకోవాలన్నారు. విభజనతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు అదనంగా రూ.8,606 కోట్ల మేర నిధులను కేటాయించాలన్నారు.
రాజధానిపై చర్చించాలి: పాలడుగు
ఏపీ రాజధాని పైన అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సూచించారు. ఈ అంశం పైన ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో పూర్తిగా పర్యటించలేదన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన సరైన చర్చ జరగక పోవడం వల్ల సీమాంధ్రకు వెయ్యి సంవత్సరాల నష్టం జరిగిందన్నారు. మరోమారు అలాంటి తప్పు వద్దన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రజలు, పార్టీల ముందు ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే రాజధాని పైన నిర్ణయం తీసుకోవాలన్నారు.