ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..
కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్ఆర్టీసీ నుంచి సహకారం కరువైంది. రోజుకో ప్రతిపాదనను తెరపైకి తెస్తే అంతర్ రాష్ట్ర సర్వీసులను టీఎస్ఆర్టీసీ అడ్డుకుంటోంది. విభజన తర్వాత ఏపీతో ఒప్పందం చేసుకోలేదని కాసేపు, కిలోమీటర్ల ప్రాతిపదికన మాత్రమే బస్సులు తిప్పాలని మరి కాసేపు, విజయవాడ, కర్నూలు వరకే మీ బస్సులు తిప్పుకోవాలని ఇంకో ప్రతిపాదనతో చుక్కలు చూపిస్తోంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో రేపు ఇరు రాష్ట్రాల అధికారులు మరోసారి భేటీకి సిద్ధమయ్యారు.
తెలంగాణ కిలోమీటర్ల పట్టు...
ఏపీ, తెలంగాణ ఆర్టీసీల విభజన తర్వాత అప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో, అవి ఏయే డిపోలవి ఉన్నాయో అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటి వల్ల తమకు భారీగా నష్టం కలుగుతోందని టీఎస్ఆర్టీసీ ఆరోపిస్తోంది. అయితే కరోనాకు ముందు ఈ అంశంపై ఎలాంటి అభ్యంతరాలు తెలపని తెలంగాణ అధికారులు.. కరోనా సాకుతో బస్సులు నిలిచిపోయిన తర్వాత ఒక్కసారిగా దీన్ని తెరపైకి తెచ్చారు. కిలోమీటర్ల ప్రాతిపదికన అయితేనే తమ బస్సులు తిప్పుతామని, మీ బస్సులు అనుమతిస్తామని కొర్రీలు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో కిలోమీటర్ల వ్యవహారంపైనే ఇంతవరకూ సాగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
లక్ష కిలోమీటర్లపై పట్టు...
ప్రస్తుతం తెలంగాణ కోరుతున్న ప్రకారం ఏపీ బస్సులు ప్రస్తుతం నడుస్తున్న దూరంలో లక్షా 12 వేల కిలోమీటర్ల దూరాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలపకపోవడంతో చివరికి మంత్రుల స్ధాయి భేటీ కూడా వాయిదా వేసుకోక తప్పలేదు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు ఏపీ-తెలంగాణ మధ్య సమాన కిలోమీటర్ల దూరం మాత్రమే బస్సులు తిప్పాలని పొరుగు రాష్ట్రం పట్టుబడుతోంది. దీంతో ప్రతిష్టంభన తప్పడం లేదు. అయితే ఈ లక్ష కిలోమీటర్ల విషయంలో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ కోరుతోంది. దీనికి తెలంగాణ సర్కారు ఒప్పుకోవడం లేదు.
విజయవాడ, కర్నూలు వరకే బస్సులు...
ఇప్పటికే కిలోమీటర్ల విషయం తేలక చర్చలు వాయిదా పడుతుంటే తాజాగా మరో ప్రతిపాదనను టీఎస్ఆర్టీసీ ఏపీ ముందు పెట్టింది. విజయవాడ, కర్నూలు వరకూ మీ ప్రయాణికులకు తీసుకెళ్లండి, అక్కడి నుంచి ఇరు రాష్ట్రాల బస్సుల్లో ప్రయాణికులు తెలంగాణకు రాకపోకలు సాగిస్తారనే కొర్రీ పెట్టింది. అంటే కోస్తా జిల్లాలకు చెందిన ప్రయాణికులు విజయవాడ వరకూ వచ్చి అక్కడి నుంచి ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ కానీ తెలంగాణలోని ఇతర జిల్లాలకు కానీ వెళ్లాల్సి ఉంటుంది. కోస్తా జిల్లాల నుంచి నేరుగా తెలంగాణకు బస్సులుండవు. అలాగే రాయలసీమ జిల్లాల వారు కర్నూలు వరకూ ఓ బస్సులో వచ్చి అక్కడి నుంచి మరో బస్సులో తెలంగాణ వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన ప్రయాణికులకు సైతం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
రేపు హైదరాబాద్లో మరో భేటీ..
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా జరగాల్సిన మంత్రుల స్ధాయి చర్చలు వాయిదా పడ్డాయి. దీంతో అధికారుల స్ధాయిలోనే మరోసారి చర్చించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. రేపు హైదరాబాద్ వెళ్లి టీఎస్ఆర్టీసీ ఎండీతో సమావేశం కానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ప్రకటించారు. కిలోమీటర్లు తగ్గించుకోవడంతో పాటు టీఎస్ఆర్టీసీ పెట్టిన తాజా ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు కూడా కరోనా నేపథ్యంలో ఆర్ధికంగా కుదేలవుతున్న నేపథ్యంలో ఈ చర్చలు త్వరగా ఫలితం ఇవ్వకపోతే మాత్రం ఆర్టీసీలు మూతపడే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో పట్టువిడుపులు ప్రదర్శించాలని ఏపీ కోరుతోంది.