భక్తుల రాకపై టీటీడీ ఆంక్షలు: అలాంటి వాళ్లు తిరుమలకు రావొద్దంటూ: వచ్చినా వెనక్కి..!
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి లక్షణాలు ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రావొద్దంటూ అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ.. దర్శన భాగ్యాన్ని కల్పించకుండానే వెనక్కి పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా 27 కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీవారి దర్శనానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. వారిలో వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం చాలా కష్టం. అందుకే- ముందు జాగ్రత్త చర్యగా ఆంక్షలను విధించింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న భక్తులు తిరుమలకు రావొద్దని ఆదేశించింది.
టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలో సమావేశమైన అధికారులు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గేంత వరకూ అాలాంటి లక్షణాలు ఉన్న భక్తులెవరూ రావొద్దని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చినప్పటికీ.. వారిని ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు చేశామని, స్వామివారి దర్శనానికి ముందే వెనక్కి పంపించేలా తిరుమలలో ఉన్న అన్ని కాటేజీలు, క్యూ లైన్ల సిబ్బందికి అంతర్గతంగా మౌఖిక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.
లక్షలాది మంది భక్తులు ఒకేచోటికి చేరుకున్న పుణ్యక్షేత్రం కావడం,ఒకరి నుంచి ఒకరికి సులువుగా ఈ ప్రాణాంతక వైరస్ సోకే అవకాశం ఉండటం వంటి కారణాల వల్ల ముందు జాగ్రత్త చర్యగాతాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఉన్న శ్రీనివాసం, విష్ణువాసం వంటి కాటేజీల సిబ్బందికీ దీనికి సంబంధించిన ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. జ్వర పీడితులు అధికంగా ఉన్నట్టయితే వారిని వెంటనే శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ (స్విమ్స్)కు తరలించేలా ఏర్పాట్ల చేసినట్లు సమాచారం.