వేసవి సెలవులు వస్తున్నాయి...అప్రమత్తమైన టీటీడీ
తిరుమల: రాబోయే వేసవి సెలవులను నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటినుంచే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
ఇటీవలి కాలంలో పలు విషయాలకు సంబంధించి టిటిడి విమర్శలు మూటగట్టుకుంటున్నందున కనీసం భక్తుల ఏర్పాట్ల విషయంలో లోటుపాట్లకు తావివ్వకుండా వారి మన్ననలు పొందాలని టిటిడి అధికారులు భావిస్తున్నారు. వచ్చే సమ్మర్ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకొని టిటిడి కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రత్యేక ఏర్పాట్లు...ఇలా
ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ భక్తులు తాకిడి ఎక్కువగా ఉండే క్రమంలో వారాంతంలో సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
ఉన్నతాధికారుల...ప్రత్యేక పర్యవేక్షణ...
అలాగే శుక్ర, శని, ఆదివారాలలో ప్రొటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పిస్తామని జెఈవో స్పష్టం చేశారు. మరోవైపు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం, ఉచిత వసతిగృహాల వద్ద ఉన్నతాధికారుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
పటిష్టమైన...భద్రతా ఏర్పాట్లు
అలాగే స్వామి వారి దర్శన ప్రవేశ మార్గాల్లో టీటీడీ విజిలెన్స్తో పాటు, పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి సరిపడా లడ్డూలు సిద్దంగా ఉంచుతామన్నారు. శ్రీవారి పోటులో నిత్యం మూడున్నర లక్షల లడ్డూల తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆన్ లైన్ టికెట్లు...సర్వే
ఆలాగే స్వామి వారి దర్శనానికి సంబంధించి వారానికి 127 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని జేఈవో వెల్లడించారు. అలాగే అలిపిరి నుంచి మోకాళ్ల మెట్ల వరకు ఇప్పుడున్న రోడ్డు మాత్రమే కాకుండా మరో రోడ్డు వేయడానికి టీటీడీ ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ఎల్అండ్టీ కంపెనీతో టిటిడి సర్వే చేయిస్తున్న విషయం వెల్లడించారు.