వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తిరుమల శ్రీవారి అర్చకులు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కలిశారు. శాలువను కప్పి స్వాగతం పలికారు. కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారం ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, అర్చకం గోవిందరాజు దీక్షితులు ఈ మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లి, మర్యాదపూరకంగా ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఒంగోలు లోక్సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఛైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి మతంపై ప్రస్తుతం రచ్చ నడుస్తోంది.
క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్గా ఎలా నియమిస్తారంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ఆయన క్రైస్తవుడు కాదని, నిఖార్సయిన హిందువు అని పేర్కొంటూ ఇదివరకు వైవీ సుబ్బారెడ్డి అయ్యప్ప మాలను ధరించిన, హోమంలో పాల్గొన్న ఫొటోలతో ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు.