రేపు టీటీడీ కీలక భేటీ- నిరర్ధక ఆస్తులపై చర్చే అజెండా- ముందుకెళతారా ?
టీటీడీ భూముల వేలంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి సమస్యలు తప్పడం లేదు. అసలే వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా మత అజెండా పేరుతో బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో భూముల అమ్మకం వ్యవహారం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీనిపై తక్షణం ఓ కీలక నిర్ణయం ప్రకటించడం ద్వారా సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్న టీటీడీ రేపు సమావేశం కాబోతోంది.
టీటీడీ ఆస్తుల పరిరక్షణకు బీజేపీ ఉపవాస దీక్ష.. భగ్గుమంటున్న బీజేపీ నేతలు
రేపు టీటీడీ కీలక భేటీ...
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తుల్లో నిరర్గకమైన వాటిని అమ్మేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిన నేపథ్యంలో తదుపరి చర్యలపై టీటీడీ దృష్టిసారిస్తోంది. నిరర్ధక ఆస్తుల విషయంలో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రేపు టీటీడీ కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇందులో టీటీడీ భూముల వేలంపై గతంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం వెనుక కారణాలేంటి ? భూముల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని దేవస్దానం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా జరుగుతున్న ప్రచారం వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి.
టీటీడీపై రాజకీయ ప్రచారం...
ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీలో ఇప్పటికే ఉన్న నిబంధనలు, వాటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులు వంటి అంశాలను పాలకమండలి చర్చించబోతోంది. శ్రీవారికి భక్తులు సమర్పించిన భూముల్లో నిరర్ధకంగా ఉన్న వాటి అమ్మకాల కోసం అప్పట్లో టీడీపీ సర్కారు, మిత్రపక్షం బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నాలు, వాటి కొనసాగింపు కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పాలమండలిలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. అప్పట్లో పాలమండలిలో ఉండి కూడా నోరు మెదపని బీజేపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ సర్కారును లక్ష్యంగా చేసుకోవడంపై పాలకమండలి చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతోంది.
ఆదాయ మార్గాలపై దృష్టి...
కరోనా వైరస్ కారణంగా రెండు నెలలుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. జూన్ 1 తర్వాత భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభించినా గతంలోలా పూర్తిస్దాయిలో ఆదాయం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే జీతాలు ఇవ్వలేక 1500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తప్పించారు. ఇలాంటి పరిస్ధితుల్లో కొత్త రాబడి మార్గాలపై టీటీడీ పాలక మండలి చర్చించ బోతోంది. టీటీడీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ఆలయ భూముల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమాలపై బోర్డు భేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.