టీటీడీలో మరో వివాదం: బోర్డు సభ్యుడి అధికార దుర్వినియోగం: ప్రైవేటు రుద్రయాగం పై..!
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడి అత్యుత్సాహం వివాదానికి కారణమైంది. టీటీడీలో ఎటువంటి ప్రైవేటు యాగాలకు అనుమతి లేదు. అయితే, తాజాగా ఒక సభ్యుడు తన అధికార దుర్వినియోగంతో టీటీడీ పరిధిలోని ఒక ఆలయంలో యాగం నిర్వహించారు. శష్టిపూర్తి ఉత్సవం సందర్భంగా ఈ యాగం నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఆ సమయంలో భక్తుల ప్రవేశాన్ని సైతం నిలిపివేసి నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనం..డిక్లరేషన్ మొదలు అనేక అంశాల పైన విమర్శలు చేస్తున్నారు.
ఇటువంటి సమయంలో బోర్డు సభ్యులుగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వ్యవహంచాల్సిన సమయంలో..వారే వివాదాలకు కారణమవుతున్నారు. అయితే, తాము బోర్డు ఛైర్మన్ అనుమతితోనే యాగం నిర్వహించినట్లుగా ఆ బోర్డు సభ్యుడు చెబుతన్నట్లుగా తెలుస్తోంది. ఇది..మరింత వివాదాస్పదంగా మారుతోంది.
బోర్డు సభ్యుడి ప్రైవేటు యాగం
టీటీడీ పరిధిలో తొలి నుండి ప్రైవేటు యాగాలు నిషేధంలో ఉన్నాయి. అయితే, తాజాగా ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త బోర్డు నియమించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వైద్యనాధన్ ఈ యాగం నిర్వహించినట్లు తెలుస్తోంది. టీటీడీ పరిధిలో ఉన్న కపిలేశ్వర ఆలయంలో నిబంధనలకు విరుద్దంగా ఈ ప్రైవేటు రుద్రయాగం నిర్వహించినట్లు సమాచారం. దీనిని పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతు న్నాయి. శష్టి పూర్తి ఉత్సవాల్లో భాగంగా ఈ యాగం నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ యాగం సమయంలో సాధారణ భక్తులను సైతం నిలిపివేసి మరీ అక్కడి అధికారులు పూర్తిగా సహకరించాలని సమాచారం. అయితే, యాగం నిర్వహణ పైన టీటీడీ సభ్యుడు సైతం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
60 మంది రుత్విక్కులతో..
ఈ యాగం నిర్వహణ కోసం బోర్డు సభ్యుడు వైధ్యనాధన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. దేశం నలుమూలల నుండి ప్రఖ్యాతంగా ఉన్న దాదాపు 60 మంది రుత్విక్కులను ఆహ్వానించారు. వారి ద్వారా ఈ యాగం నిర్వహించారు. ఆ సమయంలో బయటి వారు..భక్తులు ఎవరికీ ఆలయంలో ప్రవేశం కల్పించలేదు. అయితే, ఆలయ అధికారులు మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడా ఏమీ జరగలేదని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ, యాగం నిర్వహించామని అయితే లోక కళ్యానం కోసం నిర్వహించిన యాగంగా వివరణ ఇచ్చారు. అయితే, అధికారులు అసలు నిబంధనలకు విరుద్దంగా యాగం జరగటం లేదని చెబుతుండగా...యాగం జరిగిందని సభ్యుడు చెప్పటం ద్వారా దీని పైన కొత్త చర్చ మొదలైంది.
ఛైర్మన్ అనుమతితో జరిగిందా..
నిబంధనలకు వ్యతిరేకంగా కపిలేశ్వర ఆలయంలో యాగం జరిగిందనే సమాచారంతో దీని పైన వాస్తవాలు తెలుసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, యాగం నిర్వహించారని చెబుతున్న బోర్డు సభ్యుడు తాము ఛైర్మన్ అనుమతితోనే యాగం నిర్వహించామని చెబుతున్నట్లుగా మీడియాలో ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా టీటీడీ కేంద్రంగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా మార్చుకొని విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే అంశం పైన రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. ఈ ఆరు నెలల కాలంలో జరుగుతున్న ఈ రకమైన ప్రచారాలను ప్రభుత్వం తిప్పి కొడుతోంది. ఇదే సమయంలో ఏకంగా బోర్డు సభ్యుడే ప్రైవేటు యాగం చేసారనే సమాచారం...మరింత చర్చకు కారణమవుతోంది.