టీటీడీలో రాజకీయ రచ్చ ? చైర్మన్ Vs ఈవోగా మారిన వివాదం! సెలవులో సింఘాల్.. కదలని జేఈవో..!
Recommended Video
తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త వివాదం మొదలైంది. ఇప్పుడు వివాదం ధర్మకర్తల మండలి..ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. ధర్మకర్తల మండలితో వివాదం కారణంగా ఈవో అనిల్ కుమార్ సెలవుపైన వెళ్లారు. ఇక, వరుస వివాదాలు టిటిడీ ప్రతిష్ఠకు సవాల్గా మారాయి. అయితే, జేఈవో మాత్రం తొమ్మదేళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే వ్యక్తి ఒకే పదవిలో కొనసాగుతున్నారు.
ధర్మకర్తల మండలితో ఈవీ వివాదం..
తిరుమల..తిరుపతి దేవస్థానంలో తాజా వివాదం పీక్కు చేరింది. టిటిడిలో ఉన్నతాధికారులు..ధర్మకర్తల మండలి మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మే 8న ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించాలని 15రోజుల క్రితం ఈవో ఉత్తర్వులు జారీ చేసారు. ఆ తరువాత ఎన్నికల కోడ్ కారణంగా మే 28కి వాయిదా వేసారు. ఇదే విషయాన్ని బోర్డు సభ్యులకు తెలియ చేసారు. కొద్ది రోజుల క్రితం తలెత్తిన బంగారం తరలింపు పైన అనుమానాలు రేకెత్తటంతో బోర్డు సమాధానం ఇవ్వటానికి సమావేశాన్ని నిర్వహించాలని ఛైర్మన్ సుధాకర్ యాదవ్ భావించారు. అయితే, ఈవో సమావేశాన్ని వాయిదా వేయటాన్ని సభ్యులు తప్పు బడుతున్నారు. సమావేశం ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అత్యవసర సమావేశం పేరిట నిర్వహించాలని ఈవో పైన ఒత్తిడి తెస్తున్నారు. దీనికి ఆయన అంగీకరించటం లేదు.
సెలవు పైన ఈవో..
బోర్డు సభ్యులు ఒత్తిడి తెస్తున్న పరిస్థితుల్లో వారి డిమాండ్కు ఓకే చెప్పలేక..మరో వైపు సమావేశం ఏర్పాటు చేయలేక ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సెలవు పైన వెళ్లారు. ఉత్తరాధి అధికారిని ఈవోగా నియమించారంటూ అనిల్ కుమార్ సింఘాల్ నియామకం నుండి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. తిరుమలలో త్రవ్వకాలు..బంగారం వ్యవహారం.. ఇప్పుడు బ్యాంకు నుండి బంగారం రవాణా, తాజాగా బోర్డు సభ్యులతో సమస్య..ఇలా..ప్రతీ దానికి ఈవోగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఈవో అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో..ఆయన ప్రస్తుతం సెలవు పైన వెళ్లిపోయారు. ఇక, ఇదే సమయంలో ఎన్నికల కోడ్ కింద రాజకీయ పార్టీల నేతలకు శ్రీవారి దర్శనం టిక్కెట్లను జారీ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాజకీయ పార్టీలతో సహా తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్ష, సభ్యులకు టికెట్లు జారీ చేయడం లేదు. తిరుమలలో అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు సభ్యులకు సంబంధించిన బోర్డు సెల్ కార్యాలయాలు మూతపడ్డాయి.
జేఈవో మాత్రం కదలరు..
టిటిడిలో ఈవోలు మారుతారు..పాలక మండళ్లు మారుతాయి కానీ, జేఈవో శ్రీనివాస రాజు మాత్రం మారరు. 2011 లో డిప్యుటేషన్ మీద టిటిడి జేఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస రాజు ఇప్పటికే అనేక సార్లు డిప్యుటేషన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా..ఆయన మాత్రం ఆపోస్టు నుండి బదిలీ అవ్వరు. వివిధ రంగాల ప్రముఖలు మద్దతు ఆయనకు ఉన్నట్లుగా చెబుతారు. దీంతో..ఆయన ఏపి ప్రభుత్వంలో ఎవరు ఉన్నా..వారి మాటకు విలువ ఇచ్చి ఎంత మంది అధికారులను బదిలీ చేసినా..శ్రీనివాసరాజును మాత్రం కదిలించరు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన టిడిపి నుండి పోటీ చేస్తారనే ప్రచారమూ జరిగింది.