టీటీడీ సంచలన నిర్ణయం: చిల్లర నాణేల సమస్యకు చెక్... బ్యాంకులకు అదిరిపోయే ఆఫర్ !!
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలో వచ్చే చిల్లర టిటిడికి ఎప్పుడూ పెద్ద సమస్యే . టన్నుల టన్నుల చిల్లరను స్టోర్ చేయడం టిటిడికి పెద్ద తలనొప్పి. ఇక ఈ నేపథ్యంలోనే టీటీడీ చిల్లర సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించింది. ఇటీవల చిల్లర ను కరిగించి లడ్డూల ట్రేలను తయారు చేసే ఆలోచన చేసిన టీటీడీ దానిపై వ్యతిరేకత వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఒక తెలివైన ప్లాన్ వేసింది. బ్యాంకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.
చిల్లర నాణేలు కరిగించి లడ్డూ ట్రేలు తయారు చెయ్యాలనే నిర్ణయం పై తీవ్ర వ్యతిరేఖత
రెండు నెలల క్రితం ఎప్పుడైతే చిల్లర నాణేలను కరిగించి లడ్డూ ట్రేలుగా మారుస్తామని ఆలోచన చేశారో అప్పుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. భక్తులు సమర్పించే కానుకల్లో చిల్లర నాణేల తరలింపులో పెద్ద గోల్మాల్ జరుగుతోందని దీని వెనుక కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందని కొందరు ఆరోపణలు చేశారు. అంతే కాదు టీటీడీ పరకామణిలో పేరుకుపోయిన కోట్ల రూపాయల చిల్లర నాణేలను సకాలంలో రిజర్వ్బ్యాంక్కు తరలించి ఉంటే వాటికి బదులుగా కరెన్సీ నోట్లు పొందివుండవచ్చని కానీ టీటీడీ అధికారులు ఆపని చేయలేదని విమర్శలు వెల్లువెత్తాయి . దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కేలండర్లు, డైరీలు అందుబాటులో ఉంచినట్టుగా చిల్లర కూడా అందుబాటులో ఉంచితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్న భావన కూడా వ్యక్తం చేశారు. టీటీడీలో పేరుకుపోయిన కోట్ల రూపాయలు విలువైన నాణేలను కరిగించాలని టీటీడీ నిర్ణయించి మరో తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆరోపించిన నాయకులు భారత ప్రభుత్వం విడుదల చేసిన నాణేలను ఎవరైనా కరిగించినా, నిర్వీర్యం చేసినా వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపధ్యంలో కరిగించాలన్న నిర్ణయం మార్చుకుని చిల్లర సమస్య పరిష్కారం కోసం బ్యాంకులకు ఆఫర్ ఇచ్చారు.
బ్యాంకులకు టీటీడీ సువర్ణావకాశం .. చిల్లర డిపాజిట్ తీసుకోండి ... అంతే నగదు డిపాజిట్ చేస్తాం అంటూ టీటీడీ ఆఫర్
పేరుకుపోతున్న చిల్లర కుప్ప లతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా టిటిడి కి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ బ్యాంకులు చిల్లర విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. చిల్లర ని తీసుకోవడానికి చాలా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే టిటిడి నిర్ణయం తీసుకుంది .చిల్లర నాణేలను డిపాజిట్ చేసుకున్న బ్యాంకులకు ఎంత మొత్తం చిల్లర డిపాజిట్ చేసుకుంటారో అంతే మొత్తంలో మళ్లీ నగదును డిపాజిట్ చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు టీటీడీ అధికారులు.
ఆసక్తి చూపిస్తున్న బ్యాంకులు .. ఇకనైనా పరకామణిలో చిల్లర సమస్యకు చెక్ పడుతుందా !!
ఇక నిన్నటి వరకు చిల్లర నాణాలు సేకరించడానికి ముందుకు రాని బ్యాంకులు ఇప్పుడు నాణేల సేకరణ కు ముందుకు వస్తున్నాయి. ఇక ఈ నిర్ణయంతో టీటీడీకి చిల్లర సమస్య కొంత తగ్గుతుంది అన్న భావనతో పాటు, చిల్లర నాణేలు డిపాజిట్ చేసుకోకపోవడం వల్ల కలిగిన నష్టం ఇకముందు తగ్గనుంది.
ఇక ఇప్పటి వరకు చూసినట్లయితే టిటిడి కి సంబంధించిన చిల్లర నాణేల సేకరణ ఒక్క ఆంధ్ర బ్యాంక్ మాత్రమే చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలతో టిటిడి నుంచి 25 కోట్ల నాణేలు ఆంధ్ర బ్యాంకు సేకరించినట్లు గా గణాంకాలు చెబుతున్నాయి. టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఈ మేరకు చేసిన ప్రకటనలో బ్యాంకులకు ఇచ్చిన బంపర్ ఆఫర్ గురించి ఆయన పేర్కొన్నారు. దీంతో చిల్లర నాణేల సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిపాజిట్ల కోసం వెంపర్లాడే బ్యాంకులకు మాత్రం టీటీడీ ఇచ్చిన ఈ ఛాన్స్.. నిజంగానే సువర్ణావకాశం. మరి ఈ నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి అధికారులకు ఇబ్బందికరంగా తయారైన వందల టన్నుల చిల్లర నాణాల సమస్య ఏ మేరకు పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.