వెంకన్న సాక్షిగా వైవి సుబ్బారెడ్డి చిందులు..! మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడి ఛైర్మన్..!!
అమరావతి/హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కోపం వచ్చింది. అవును ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిత్యం ఆద్యాత్మికతను ఆస్వాదిస్తూ పరమ ప్రశాంతతను పొందాల్సిన సుబ్బారెడ్డి కోపంతో ఊగిపోయారు. అదికూడా ఆయన చేతికింద సిబ్బంది మీద కాదు. మీడియా మీద. వార్తలను నిత్యం ప్రజలకు చేరవేసే మీడియా మీద సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. విలేకరులు సమావేం నిర్వహించి మరీ తన అసంతృప్తిని వ్యక్తం చేసారు.
ఇంతకీ మీడియా మీద అంతాగా రెచ్చిపోవడానికి కారణం తెలుసుకుంటే అంత చిన్న అంశానికి ఎందుకిలా అసమనానికి లోనయ్యరనే సందేహం రాక మానదు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్ను నియమించారంటూ తప్పుడు వార్తను ఓ 24 గంటల వార్తా ఛానెల్ తన వెబ్సైట్లో పెట్టిందని ఆయన ఆరోపించారు.
కాగా సంబంధిత వెబ్సైట్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కేసును కూడా పెడతామని సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని విమర్శించారు. వైయస్.జగన్ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను వారు స్వాగతించలేకపోతున్నారని, దేవుడు ముందు అందరూ సమానులే అని మేం నిరూపిస్తుంటే, ఆ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, వైయస్.జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ చేతిలో ఉన్న యెల్లోమీడియాను వాడుకుని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారని విమర్శించారు. ఇలా విషప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.