టీటీడీ హుండీలో రద్దయిన పాత నోట్లు... మార్పిడికి అవకాశం కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి...
టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. నవంబర్ 8,2016న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ... ఆ తర్వాత కూడా చాలామంది భక్తులు రూ.500,రూ.1000 కరెన్సీ నోట్లను శ్రీవారి హుండీలో కానుకలుగా సమర్పించినట్లుగా తెలిపారు. మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో టీటీడీ కూడా దానికి అడ్డు చెప్పలేకపోయిందన్నారు. మంగళవారం(సెప్టెంబర్ 15) ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఆమెకు వినతిపత్రం సమర్పించారు.
కేంద్రం అవకాశం కల్పిస్తే టీటీడీ వద్ద పెద్ద ఎత్తున ఉన్న పాత నోట్లను మార్పిడి చేసి... ఆ నగదుతో మరిన్ని ధార్మిక సేవా కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి గతంలో పలుమార్లు టీటీడీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన రాలేదని సీతారామన్తో చెప్పారు. ఇప్పటికైనా దీనిపై సానుకూలంగా స్పందించి ఆ పాత నోట్లను రిజర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
నిజానికి పెద్ద నోట్ల రద్దు తర్వాత టీటీడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించిందని... కానీ భక్తులు మాత్రం హుండీ ద్వారా రద్దయిన నోట్లను కానుకలుగా సమర్పిస్తూ వచ్చారని తెలిపారు. టీటీడీ హుండీ ద్వారా లభించే కానుకలకు పక్కాగా రికార్డులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగానికి రూ.23.78 కోట్ల పెండింగ్ జీఎస్టీని రద్దు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ రద్దుతో టీటీడీ మరిన్ని సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.