చంద్రబాబు మెడకు తిరుమల అన్యమత ప్రచారం వివాదం..!? అది గత ప్రభుత్వం చేసిన ఒప్పందమే: వైవీ
తిరుపతి: తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే బస్సుల్లో ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల వెనుక అన్యమతానికి సంబంధించిన ప్రకటనలు ముద్రించిన వ్యవహారం.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి తెర తీసింది. ఈ అంశంపై భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్న నేపథ్యంలో.. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఇలాంటి ప్రచారానికి దారి తీస్తోందంటూ విమర్శించింది.
దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టికెట్ల వెనుక ముద్రించిన ప్రభుత్వపరమైన ప్రకటనలు చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నవేనని అన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ మొత్తం ప్రక్రియకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నమోదైందని అన్నారు.
టికెట్ల వెనుక మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన ప్రకటనల ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పారు. 60 వేల టిమ్ పేపర్ల బండళ్లపై జెరూసలేం, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రకటనలను ముద్రించడానికి 2018లో మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్ అనే సంస్థకు కాంట్రాక్టును అప్పగించారని అన్నారు. ఆ టెండర్ కారణంగానే తిరుమల బస్ టిక్కెట్లపై ప్రకటనలను ముద్రించారని చెప్పారు. బస్ టిక్కెట్ల వెనుక ఈ ప్రకటనలను తొలగించేలా తాము తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ కాంట్రాక్టును వెంటనే రద్దు చేస్తామని తెలిపారు.