వైఎస్ జగన్కు వైవీ సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి: వైసీపీ అభిమానులకూ మింగుడు పడని నిర్ణయం
Recommended Video
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరికొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా సమర్థించట్లేదు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, అక్కడి నుంచి తిరుమల పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తానంటూ ఆయన ఇటీవలే ప్రకటించారు. తనను ఎవరు కలుసుకోవాలనుకున్నా, క్యాంపు కార్యాలయానికే రావాల్సి ఉంటుందని సూచించారు. ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.
సరికొత్త సంప్రదాయమా?
ఇదివరకు ఏ ఛైర్మన్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇదో తేనెతుట్టె. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఏ చిన్న తేడా కొట్టినా.. అసలుకే ఎసరు పడుతుంది. ప్రస్తుత పరిస్థితి దాన్నే సూచిస్తోంది. తిరుమల లేదా తిరుపతి కేంద్రంగా తన పరిపాలన వ్యవహారాలను కొనసాగించాల్సిన టీటీడీ బోర్డు చైర్మన్ రాజధాని ప్రాంతంలోని తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని అనుకోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్వయంగా వైఎస్ఆర్ సీపీ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పదమైన, సరికొత్త సంప్రదాయానికి వైవీ సుబ్బారెడ్డి తెర తీస్తున్నారని అంటూ ధ్వజమెత్తుతున్నారు.
ముఖ్యమంత్రి దృష్టిలో పడటానికా!
టీటీడీ చరిత్రలో పాలక మండలి ఛైర్మన్గా పనిచేసిన నాయకులు తిరుమల లేదా తిరుపతి అలిపిరి సమీపంలోని దేవస్థానానికి చెందిన పరిపాలనా భవనం కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగించేవారు. ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల్లో వైవీ సుబ్బారెడ్డి కూడా తిరుమలలో టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్ను ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా ఆయన తిరుమల వైపు కన్నెత్తి చూడటం మానేశారు. తిరుమలలో కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో ఉండేలా తాడేపల్లిలోనే గడిపేస్తున్నారు.
టీటీడీపై అదనపు భారం
రాజధాని ప్రాంతంలో గల తాడేపల్లిలో ఎక్కువగా గడుపుతున్న ఆయన ఇక పూర్తిస్థాయి కార్యకలాపాలను అక్కడి నుంచే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం కొత్తగా తన కోసం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటానని వెల్లడించారు. టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయం అంటే అధికారికమే. దీని నిర్వహణ ఖర్చు భారం అంతా టీటీడీ నుంచే చెల్లించాల్సి ఉంటుంది. పైగా- టీటీడీ నుంచి కనీసం పదిమంది సిబ్బందిని ఈ కార్యాలయానికి కేటాయించాలని ఆయన కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్కు లేఖ సైతం రాశారు. సిబ్బందితో పాటు తన కార్యాలయానికి తగిన ఫర్నిచర్ సమకూర్చాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
బ్రహ్మోత్సవాలు కూడా అక్కడే నిర్వహిస్తారా?
ఈ నేపథ్యంలో- తిరుమల, తిరుపతిల్లో ఉన్న టీటీడీ పరిపాలనా భవనాలను ఇక మూసేయడమే మేలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డిపై మండిపడుతున్నారు. తిరుమల వంటి పరమ పవిత్రమైన దేవస్థాన బాధ్యతల నిర్వాహణ విషయంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నా, అది ప్రభుత్వంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను కూడా ఇక తాడేపల్లి నుంచే నిర్వహించేలా ఉన్నారని అంటూ వైవీ సుబ్బారెడ్డిని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. తిరుమల ఆలయానికి కూడా తాళం వేసి, తాడేపల్లిలోనే ఓ మోడల్ ఆలయాన్ని కట్టించుకుంటే సరిపోతుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నప్పటికీ.. వైవీ సుబ్బారెడ్డి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందనా రాలేదు.