అలిగిన బాబాయ్- ఆ రెండు జిల్లాలను పట్టించుకోని వైవీ.. రంగంలోకి జగన్...
ఏపీలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధిత్వాల ఖరారు వైసీపీలో చిచ్చురేపింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సీఎం జగన్ బాబాయ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనకు అవకాశం దక్కకపోవడంతో అలిగారు. స్ధానిక ఎన్నికల కోసం తనకు అప్పగించిన గోదావరి జిల్లాల బాధ్యతలను ఆయన మధ్యలోనే వదిలేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ అవకాశం వస్తుందని వైవీ గంపెడాశతో ఉన్నారు.
2019 ఎన్నికల్లో ఒంగోలు సీటు త్యాగం
2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్ధానం నుంచి గెలుపొందిన వైవీ సుబ్బారెడ్డికి 2019లో మాత్రం వైసీపీ నుంచి మొండిచేయి ఎధురైంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రతీ సీటు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్ధితుల్లో టీడీపీ నుంచి వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలులో అవకాశం ఇచ్చారు. ఇందుకోసం బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒప్పించిన జగన్.. అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆయన ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని వైసీపీ తరఫున గోదావరి జిల్లాల బాధ్యతలు చూసుకున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి..
వైసీపీ అధికారంలోకి రాగానే తొలిసారి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్ధానాల్లో తనకు జగన్ ఒక్కటి ఎలాగైనా కేటాయిస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే మొదట్లో అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రెండు సీట్లు ఇద్దామని, మరో రెండు సీట్ల కోసం ఇతర అభ్యర్ధులను చూడాలని భావించారు. కానీ అంతలోనే ముకేష్ అంబానీ అమరావతి రావడం, తన మనిషి పరిమళ్ నత్వానీకి ఓ సీటు ఇవ్వాలని కోరడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇద్దరు రెడ్లకు బదులు ఒకరికే చోటు కల్పించాల్సిన పరిస్దితి తలెత్తింది.
నత్వానీకి ఖరారు అయ్యాక కూడా..
అంబానీ మనిషి నత్వానీకి ఓ రాజ్యసభ సీటు కేటాయించాక కూడా అయోధ్య రామిరెడ్డితో పాటు తన పేరు కూడా పరిశీలిస్తారని వైవీ ఆశించారు. కానీ మండలి రద్దుతో మాజీలు కాబోతున్న ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకు పంపాల్సిన పరిస్దితి జగన్ కు ఎదురైంది. వీరిలో ఒకరిని పంపి, మరొకరిని ఆపితే వేరే సంకేతాలు వెళతాయన్న భావనతో జగన్ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరికీ అవకాశం కల్పించారు. దీంతో వైవీకి మొండిచేయి చూపక తప్పలేదు.
వైవీ అలక.. రంగంలోకి జగన్ ...
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురు సభ్యుల పేర్లు ఖరారైనట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుకున్న వైవీ అలకబూనారు. రెండ్రోజులుగా పార్టీ నేతలకు సైతం వైవీ అందుబాటులో లేకుండా పోయారు. స్దానిక ఎన్నికల కోసం ఆయన ఇన్ ఛార్జ్ గా ఉన్న గోదావరి జిల్లాల వ్యవహారాలను కూడా వైవీ పట్టించుకోవడం మానేశారు. దీంతో వైవీ అలక వ్యవహారం సీఎం జగన్ వరకూ వెళ్లింది. దీంతో ఆయన బాబాయ్ వైవీతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. ఏపీలో భవిష్యత్తులో రాబోయే రాజ్యసభ ఖాళీల్లో తప్పకుండా అవకాశం ఇస్తానని వైవీని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.