తిరుమల శ్రీవారి ఆలయంలో సిబ్బంది చేతివాటం...రూ.10 లక్షల శ్రీవారి లడ్లు దారి మళ్లింపు
తిరుమల:తిరుమల శ్రీవారి ఆలయంలో రూ. 10 లక్షల విలువ చేసే లడ్ల గోల్ మాల్ వ్యవహారంలో టీటీడీ సిబ్బంది చేతివాటం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో ఒక రోజు కౌంటర్ వద్ద లడ్డూ టోకెన్ల స్కానర్ పనిచేయలేదట.
ఇదే అవకాశంగా తీసుకొన్న టిటిడి సిబ్బంది 16 వేల శ్రీవారి లడ్లను దారిమళ్లించారట. ఇది టిటిడి కాంట్రాక్ట్ సిబ్బంది పనేనని అధికారులు అంటున్నారు. అలా మాయమైన లడ్ల ఖరీదు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. అయితే అంతకంటే ఎక్కువ లడ్లే దారి మాళ్లాయా?...సిబ్బంది ఇలాగే ఇంకెప్పుడైనా చేతివాటం ప్రదర్శించారా?...అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.
లడ్డూలు...దారి మళ్లింపు
తిరుపతి లడ్డూకు భక్తులు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకొనే భక్తుల్లో లడ్డూ తీసుకోకుండా వెనుతిరిగే భక్తుడు ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో గరుడ సేవ రోజున లడ్డూ కేంద్రాల్లో 16 వేల లడ్లు దారిమళ్లినట్లు బైటపడటం సంచలనం సృష్టించింది.
అదే...అవకాశంగా
గరుడ సేవ రోజున తిరుమలకు సుమారు 4లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేయగా స్వామి వారి మూలవిరాట్ దర్శనం, ఉత్సవ విగ్రహాల దర్శనానికి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చే భక్తులు లడ్డూలు తీసుకొనే సమయంలో లడ్డూ టోకెన్ల స్కాన్ మెషీన్ పనిచేయలేదు.
అధికారులు...గుర్తించారు
దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో అవి స్కాన్కాకపోయినా...టోకెన్లు తీసుకొని భక్తులకు లడ్డూలు ఇచ్చేయాలని టిటిడి అధికారులు అప్పటికప్పుడు ఆదేశాలు జారీచేశారు. అయితే ఇదే అదనుగా టిటిడి సిబ్బంది రూ.10 లక్షల విలువైన లడ్లను దారి మళ్లించారట. అయితే తదనంతరం ఈ విషయం బయటపడడంతో విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నారని తెలిసింది. అయితే ఇలా చేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులేనని అంటున్నారు.
అన్ని కోణాల్లో...విచారణ
ఇప్పటివరకు 16వేల లడ్డూలే దారిమళ్లాయని గుర్తించినప్పటికీ...గరుడ సేవ జరిగిన రోజు నుంచి నుడు చక్రస్నానం వరకు లడ్డూ కౌంటర్లలో ఎన్ని లడ్డూలు విక్రయం జరిగాయి?...వీటిలో ఎలాంటి అక్రమాలైనా జరిగాయి?...ఇంకెప్పుడైనా ఇలా జరిగిందా?...అనే కోణాల్లోనూ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.