టీటీడీలో లైంగిక ఆరోపణల కలకలం:తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని ఏఈవోపై మహిళా ఉద్యోగి ఫిర్యాదు
చిత్తూరు:దేవాలయాల్లో లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండటంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. తాజాగా తిరుమల తిరుమల దేవస్థానంలో ఒక ఉద్యోగిపై లైంగిక వేధింపులకు సంబంధించి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
పైగా ఆమె తన ఫిర్యాదులో ఆ ఉద్యోగి తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నట్లు పేర్కొనడం కలకలం రేపుతోంది. మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ను స్వీకరించిన పోలీసులు ఈ వ్యవహారంపై క్షుణ్నంగా వచారణ జరుపుతామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులు ఎవరైనా చర్యలు తప్పవని తెలిపారు. వివరాల్లోకి వెళితే...
టిటిడి కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏఈవో శ్రీనివాసులుపై ఓ మహిళా ఉద్యోగి తన కుమార్తెతో కలసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఈవో శ్రీనివాసులు... తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ మహిళా ఉద్యోగి తన ఫిర్యాదులో పేర్కొంది. ఏఈవో శ్రీనివాసులు తన కుమార్తెకు ఫోన్ చేసి అతడికి లైంగికంగా సహకరించకుంటే నీ తల్లిని వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆ మహిళా ఉద్యోగి పేర్కొంది.
టిటిడి మహిళా ఉద్యోగి ఆమె కుమార్తెతో కలసి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ పరిధిలో పనిచేస్తున్న ఏఈవోపై ఇలా లైంగిక వేధింపులు రావడం, అదీ పోలీసు స్టేషన్ లో నమోదు కావడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు టిటిడి కాంట్రాక్టర్ భాస్కర్నాయుడు, ఆయన అనుచరులు కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ బుధవారం టిటిడి కాంట్రాక్టు కార్మికులు మెరుపు ధర్నా నిర్వహించారు. భాస్కర్నాయుడు అనుచరులైన రామారావు, సౌజన్యలు కార్మికుల పట్ల మంగళవారం రాత్రి అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం చెందిన కార్మికులు విష్ణు నివాసం నాలుగో అంతస్తులో ధర్నాకు దిగారు.
తమకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమని పట్టుబట్టి ధర్నాకు దిగారు. అయితే వీరి ఆందోళనను ఉన్నతాధికారులు ఖాతరు చేయకపోవడంతో సురేష్ అనే కార్మికుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోగా...పక్కనే ఉన్న కార్మికులు అతనిని నిలువరించి ప్రాణాలు కాపాడినట్లు చెబుతున్నారు. అయితే కార్మికులు ఆందోళన విరమించుకోకపోవడంతో సుమారు పది గంటల పాటు ఆ ప్రదేశం నినాదాలతో అట్టుడికిపోయింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ భాస్కర్నాయుడు ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయని, అతనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించు కోవడం లేదన్నారు. కార్మికుల ఆందోళన విషయం తెలిసి విష్ణు నివాసం విజిఒ అశోక్కుమార్ గౌడ్ అక్కడికి చేరుకుని కార్మికులతో చర్చించారు. కార్మికుల సమస్య లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం అక్కడికి వచ్చిన తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్లకు తమ బాధలను తెలిపారు.
అయితే కార్మికుల ఆందోళనను చిత్రీకరించేందుకు వెళ్లిన వివిధ ఫోటో, వీడియో జర్నలిస్టులపై టిటిడి విజిలెన్స్ సిబ్బంది దాడికి పాల్పడ్డటం కలకలం రేపింది. ఇదేమని ప్రశ్నించిన జర్నలిస్టుల కెమెరాలు, సెల్ఫోన్లను టిటిడి సిబ్బంది లాక్కొని దౌర్జన్యం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు సుమారు ఏడుగంటల పాటు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు అధికారులు దిగొచ్చి మీడియాకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు శాంతించారు.