టీటీడీ ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు, క్యాంటిన్లో ఉచితంగా ఇమ్యూనిటీ పెంచే ఆహారం
తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ట్రూనాట్ మిషన్లు కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో గల తన ఛాంబర్లో అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో శ్రీ బసంత్కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త, టీటీడీ జేఈవో భార్గవి,సీవీఎస్వో గోపినాథ్ జెట్టితో సమావేశం నిర్వహించారు.
తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఈవో ఆదేశించారు. ఉద్యోగుల క్యాంటీన్లో వ్యాధి నిరోధక శక్తి పెంచే ఆహారం ఉచితంగా అందించాలని స్పష్టంచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో సమన్వయం చేసుకోవాలని టీటీడీ ఆరోగ్య శాఖాధికారికి స్పష్టంచేశారు. తిరుమలలో విధులు నిర్వహిస్తూ బ్యారక్లో ఉంటున్న సెక్యూరిటీ సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో గుంపులుగా చేరకుండా అవగాహన కల్పించాలన్నారు.
తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ప్రత్యేక గదులు కేటాయించాలన్నారు. తిరుపతి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలోని వంట గదిని జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించాలని సూచించారు. మాధవం క్వారంటైన్ సెంటర్కు ప్రత్యేకాధికారిగా డెప్యూటీ ఈవో జనరల్ను నియమించారు. సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. దర్శనం తర్వాత కూడా భక్తులకు టీటీడీ సిబ్బంది ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారని వివరించారు.
Recommended Video
ఆ తర్వాత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించారు. ఈవో సమీక్ష తర్వాత అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు స్పష్టంచేశారు. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఖర్చుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు.