వైఎస్ జగన్ బెస్ట్ ఫ్రెండ్, తమిళ నటుడు సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ: తర తమ భేదాల్లేవ్
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తోన్న వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేలా కనిపించట్లేదు. తిరుమల, శ్రీవారి ఆలయం, స్వామివారి దర్శనం, భక్తులకు కల్పిస్తోన్న వసతి సౌకర్యాల గురించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తోన్న వారిపై కేసులను నమోదు చేస్తోంది. ఈ క్రమంలో ఒకేరోజు ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు టీటీడీ అధికారులు. వారిలో తమిళ నటుడు సూర్య తండ్రి కూడా ఉన్నారు.
జగన్కు అసలు అగ్నిపరీక్ష: శాసన మండలి సంగతేంటీ? 19 నుంచి బడ్జెట్ భేటీ: అసెంబ్లీతో పాటు
వీడియో ఆధారంగా..
తిరుమల, శ్రీవారిపై హేట్ స్పీచ్ ఇచ్చారని భావిస్తోన్న ప్రముఖ తమిళ నటుడు సూర్య తండ్రి శివకుమార్పై కేసు నమోదు చేశారు టీటీడీ అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బెస్ట్ ఫ్రెండ్ అనే పేరుంది హీరో సూర్యకు. శ్రీవారి ఆలయం, భక్తులకు కల్పిస్తోన్న సౌకర్యాల గురించి శివకుమార్ దుష్ప్రచారం చేశారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది. 70, 80వ దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగారు శివకుమార్. కిందటి నెల 29వ తేదీన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
తిరుమలకు ఎందుకు వెళ్లాలంటూ..
తిరుమలపై దుష్ప్రచారం చేసేలా శివకుమార్ ప్రసంగం సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి తిరుమలకు వెళ్లే భక్తులకు క్షణకాలం పాటు కూడా దర్శన భాగ్యం దక్కదని, అలాంటప్పుడు శ్రీవారి దర్శనానికి ఎందుకు వెళ్లాలంటూ శివకుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. గంటలపాటు క్యూలైన్లో నిల్చుని, సర్పం మాదిరిగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని, తీరా శ్రీవారి దర్శనానికి వెళ్తే.. అక్కడి అర్చకులు జరగండి.. జరగండి అంటూ భక్తులను తోసివేస్తారని అన్నారు.
తమిళ భక్తుడి ఫిర్యాదు మేరకు..
ఆయన చేసిన ఈ ప్రసంగంపై తమిళనాడుకు చెందిన శ్రీవారి భక్తుడొకరు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను సేకరించిన ఓ వీడియో క్లిప్ను ఆయన టీటీడీకి పంపించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని ఇమెయిల్ ద్వారా విజ్ఙప్తి చేశారు. ఈ వీడియో క్లిప్లో ఉన్న ప్రసంగం, తమిళ భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శివకుమార్పై హేట్ స్పీచ్ కింద కేసు నమోదు చేసినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.
Recommended Video
మరో ఎనిమిది మందిపైనా
ఇదే క్రమంలో తిరుమలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన మరో ఎనిమిది మందిపైనా కేసు పెట్టారు టీటీడీ అధికారులు. ఇందులో తెలుగు ఎథిస్ట్ అనే ఫేస్బుక్ పేజీ నిర్వాహకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారత నాస్తికుల సమాజం ప్రతినిధులు ఈ పేజీని నిర్వహిస్తున్నట్లు సమాచారం. టీటీడీ పాలక మండలి హిందూ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని, ఈ కారణంతో బోర్డు సభ్యురాలు సుధామూర్తి రాజీనామా చేశారంటూ ఈ ఫేస్బుక్ పేజీలో రాసినట్లు సమాచారం. సుధామూర్తి రాజీనాయా చేశారనే విషయం నిరాధారం కావడంతో కేసు పెట్టారు.