టీటీడీ నిధులతోనే చంద్రబాబు దీక్ష: నిగ్గు తేల్చిన విజిలెన్స్: చర్యల దిశగా..!
Recommended Video
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలకు టీటీడీ నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర ఆలయ నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టమైంది. ప్రీ ఆడిట్ లేకుండానే నిధులు వెచ్చించినట్లుగా విజిలెన్స్ విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. దీని పైన మూడు రోజులుగా తిరుపతి విజిలెన్స్ డీఎస్పీ మల్లేశ్వర రెడ్డి టీం ఢిల్లీలో తనిఖీలు నిర్వహించారు. అందులో ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటుగా పార్టీ నేతలు ..తరలి వచ్చిన అనేక మంది కోసం ఈ నిధులు వెచ్చించినట్లుగా గుర్తించారు. ఈ దీక్షలకు టీటీడీ నిధులు దాదాపు నాలుగు కోట్ల రూపాయాల వరకు ఖర్చు చేసినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా ఈ విచారణ సాగింది. అందులో ఈ ఫిర్యాదులు నిజమేనని విజిలెన్స్ తేల్చినట్లుగా ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు.
దీక్ష నిర్వహించిన రోజుల్లో కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు..శ్రేణులకు భోజనాలు..టీ..స్నాక్స్ వంటివి ఢిల్లీ లోని శ్రీవేంకటేశ్వర ఆలయం నుండే సమకూర్చినట్లు అధికారులు తేల్చారు. దేవస్థానం నిధుల దుర్వినియోగం తెలుసుకున్న ఈఓ వైవీ సుబ్బారెడ్డి దీని పైన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టీటీడీ నిధుల ఖర్చులో ఆడిట్ సక్రమంగా లేకపోవటాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. టీటీడీ ఢిల్లీ ఆలయంలో ప్రతీ ఏటా వెచ్చించే దాదాపు రూ 70 లక్షలకు ప్రీ ఆడిట్ కూడా లేదు.
దీంతో..ఈ కమిటీకి ఉన్న అధికారాలను టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్ తొలిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, ఇప్పుడు విజిలెన్స అధికారికంగా తమ నివేదిక ఇచ్చిన తరువాత టీటీడీ నేరుగా ప్రభుత్వానికి చర్యల దిశగా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. గతంలో ఇదే వ్యవహారంలో ఢిల్లీ లోకల్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ పదవికి ఒక అధికారి రాజీనామా చేసారు.
ఇక, ఆ సమయంలో ప్రభుత్వం వద్ద దీక్షల పేరుతో నిధుల సర్దబాటు పేరుతో టీటీడీ నిధులు వినియోగించినట్లుగా అప్పటి సిబ్బంది విచారణ లో భాగంగా వివరించినట్లు తెలుస్తోంది. ఇక, అధికారికంగా విలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తరువాత దీని పైన టీటీడీ..ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.