శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తున్న పాలకమండలి:రమణదీక్షితుల ఆరోపణలకు చెక్ చెప్పేందుకే!
తిరుమల: శ్రీవారి ఆభరణాల పరిశీలనా కార్యక్రమాన్ని టీటీడీ పాలకమండలి సోమవారం చేపట్టింది. ఆలయంలో రాములవారి మేడలోని ఉన్న లాకర్లలో ఆభరణాలను సభ్యులు పరిశీలిస్తున్నారు.
Recommended Video
శ్రీవారి ఆభరణాలపై టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా స్వామి వారి భక్తుల్లో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. దీన్ని తొలగించే చర్యల్లో భాగంగా టీటీడీ తాజా చర్యకు ఉపక్రమించింది. జేష్టాభిషేకం తర్వాత బోర్డు సభ్యులు శ్రీవారి ఆభరణాల రిజిస్టర్, నగలను స్వయంగా పరిశీలిస్తున్నారు. తదనంతరం మీడియా సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల స్వామి వారి ఆభరణాల గురించి, నిధి నిక్షేపాల కోసం తవ్వకాల గురించి పలు ఆరోపణలు చేయడంతో పాటు శ్రీకృష్ణదేవరాయులు, మైసూరు మహారాజుల పాలనాకాలంలో శ్రీవారి పలురకాల ఆభరణాలు సమర్పించారని మీడియా సమావేశాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే పింక్ డైమండ్ విదేశాలకు తరలించారని ఆరోపించారు. అంతేకాదు శ్రీవారి నగలకు భద్రతలేకుండా పోతోందని దుయ్యబట్టారు.
అయితే రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ పాలకమండలి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. బ్రహోత్సవాల్లో గరుడవాహనసేవ సందర్భంగా కెంపు ఒకటి పగిలిపోయిందని, దాన్ని కూడా ఆభరణాలు భద్రపరిచేచోట జాగ్రత్తగా ఉంచామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆ తరువాత కూడా రమణ దీక్షితులు పలురకాల ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను ఆగమసలహా మండలి సభ్యులు సుందరవదన భట్టాచార్యులు కూడా ఖండించారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. పోటుకు మరమత్తులు చేయాల్సివస్తే దానికి ఆగమసలహా మండలి అంగీకరించిందని అందులో రమణదీక్షితులు కూడా ఉన్నారని భట్టాచార్య తెలిపారు.
అయితే రమణ దీక్షితుల ఆరోపణల నేపథ్యంలో భక్తుల్లో నెలకొన్న సందేహాలు పటాపంచలు కావాలంటే కేవలం టిటిడి పాలక మండలి సభ్యులే ఆభరణాలు పరిశీలించినా ఆరోపణలకు అడ్డుకట్ట పడదని, భక్తుల నుంచి కొందరిని, బాధ్యతాయుతమైన వ్యక్తులను మరికొందరిని వెంటబెట్టుకొని ఆభరణాలను పరిశీలిస్తే మరింత పారదర్శకంగా ఉండేదని భక్తుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు.